మూడేళ్ల తరువాత హత్య కేసు వెలుగులోకి
నిందితుడి అరెస్ట్
స్నేహితుడిని క్షమాపణ కోరి కన్నీరు
యశవంతపుర : మూడేళ్ల క్రితం స్నేహితుడిని రైలు నుండి తోసి హత్య చేసిన కేసును పోలీసులు ఛేదించారు. వివరాలు... నాయండహళ్లి వినాయక లేఔట్లోని నాగరాజ్ అనే వ్యక్తి ఇంటి పక్కకు అభిషేక్ కుటుంబం అద్దెకు రావటంతో నాగరాజు కుమారుడు దినేశ్తో అభిషేక్కు మంచి స్నేహం కుదిరింది. దీంతో రోజూ మద్యం తాగటం, గొడవలు పడటం జరిగేది. ఇదిలా ఉంటే 2016 మార్చి 16న దినేశ్ రైలు కింద పడి అనుమానాస్పదంగా మృతి చెందాడు.
ఎలా మృతి చెందాడనేది ఒక అభిషేక్ మాత్రమే తెలుసు. అయితే ఈ నెల 13న స్నేహితులైన సునీల్, కెంపేగౌడలతో కలిసి అభిషేక్ పీకలదాక మద్యం తాగాడు. నిందితుడు అభిషేక్ మత్తులో ఏమి మాట్లాడుతున్నాడో తెలియక దినేశ్ మృతి గురించి బయటకు చెప్పేశాడు. మనం అభిషేక్, సునీల్, కెంపేగౌడ, దినేశ్ మంచి స్నేహితులం అయితే మీకు తెలియకుండా పెద్ద తప్పుచేశా. ఆ రోజు నాయండహళ్లి ఓ వైన్ దుకాణంలో అందరం పార్టీ చేసుకున్నాం. ఆ సమయంలో దినేశ్ కూడా మన జతలో ఉన్నాడు. మీరు ఇళ్లకు పోయిన తరువాత నేను దినేశ్ను నాయండహళ్లి రైల్వేస్టేషన్ వద్దకు తీసుకెళ్లాను. ఆ సమయంలో నగదు విషయమై ఇద్దరి మధ్య వాదులాట జరిగింది. అదే సమయంలో మైసూరు వైపు వెళ్లతున్న రైలు కింద తోసేసి హత్య చేసినట్లు సునీల్, కెంపేగౌడకు చెప్పాడు. విషయం తెలుసుకుని ఆందోళనకు గురైన స్నేహితులద్దరూ తక్షణం దినేశ్ తండ్రి నాగరాజ్కు ఫోన్ చేసి సమాచారం అందించాడు. మరుసటి రోజున ఆయన జరిగిన విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్షణం పోలీసులు రంగంలోకి దిగి అభిషేక్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. దినేశ్ గోరి వద్దకు నిందితుడిని తీసుకెళ్లగా ఫోటోను చూసి అభిషేక్ కన్నీరుపెట్టాడు.
నమ్మి మోసపోయాం
అభిషేక్ మంచి స్నేహితుడు కావటంతో దుఖంలో మృతదేహం దొరికిన చోటుకు రాలేదు. తిథి కార్యానికి రాలేదు. కారణం స్నేహితుడు మరణంతో దుఖఃలో ఉన్నట్లు భావించినట్లు దినేశ్ తండ్రి నాగరాజ్ అవేదన వ్యక్తం చేశాడు. ఘటన జరిగిన తరువాత కుటుంబసభ్యులు ఇంటిని ఖాళీ చేసిన తరువాత తనకు అనుమానం పెరిగిపోయిందని, ఒకరోజు నిలదీశానని ఆవేదన వ్యక్తం చేశాడు.
సమాధి ముందు క్షమాపణ
పోలీసులు నిందితుడు అభిషేక్ను దినేశ్ గోరి వద్దకు తీసుకెళ్లగా గోరిపై ఉన్న స్నేహితుడి ఫోటోను చూసి కన్నీరు పెట్టాడు. ఇటీవల దినేశ్ కలలో రావటంతో గోరికి పూజలు కూడా చేశాడు.