స్నేహితుల దారుణ హత్య..

5 Jan, 2018 07:36 IST|Sakshi

హతుల్లో ఒకరు గంజాయి వ్యాపారి

హంతకుల కోసం పోలీసుల గాలింపు

సాక్షి, అన్నానగర్‌: ఆరల్‌వాయ్‌మొలి సమీపంలోని సీతప్పాల్‌ కొండ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు మిత్రులు దారుణ హత్యకు గురయ్యారు. హతుల్లో ఒకరు గంజాయి వ్యాపారి ఉన్నారు. సీతప్పాల్‌ ఎస్‌ఏ వీధికి చెందిన భునేష్‌మణి (35). ఇతని భార్య సూర్య, దంపతులకు నాలుగేళ్ల కుమార్తె ఉంది. ఇతను గంజాయి వ్యాపారి కావడంతో ఆరల్‌వాయ్‌మొళి, భూతప్పాండి, కొట్టార్‌ పోలీసు స్టేషన్లలో 16 కేసులు నమోదై ఉన్నాయి. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారనే సమాచారం అందగానే సీతప్పాల్‌లోని కొండ ప్రాంతంలో తలదాచుకునేవాడు. 

ఇటీవల ఓ కేసులో అరెస్టై, ఆ తర్వాత బెయిల్‌పై బయటకి వచ్చిన భువనేష్‌మణి మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో తన స్నేహితుడు వడచేరి అరుగువిలైకి చెందిన షాజీ ఇంటికి వెళ్లాడు. అనంతరం ఇద్దరు బయటకు వెళ్లి ఇంటికి తిరిగిరాలేదు. భువనేష్‌మణి కోసం భార్య బుధవారం పలు చోట్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. సీతప్పాల్‌ కొండపై ప్రాంతంలో ఉంటాడనే అనుమానంతో భునేష్‌మణి తండ్రి మణి అక్కడికి వెళ్లి చూశాడు. 

అక్కడ భునేష్‌మణి గొంతు కోయబడిన స్థితిలో, షాజీ కత్తి గాయాలతో మృతి చెంది ఉండటం చూసి దిగ్భ్రాంతి చెందాడు. వెంటనే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసారి పల్లమ్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, హంతకుల కోసం గాలిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు