నిత్య పెళ్లి కొడుకు అరెస్ట్‌ 

1 Jan, 2019 09:52 IST|Sakshi

పెళ్లి చేసుకొని సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌కు రూ. 60 లక్షల టోకరా

గచ్చిబౌలి : తాను ఆర్మీలో సీక్రెట్‌ ఏజెంట్‌గా పని చేస్తున్నానని మ్యాట్రిమోనిలో తప్పుడు సమాచారం ఇచ్చి ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను పెళ్లి చేసుకున్నాడు. నమ్మించి వంచించి రెండుసార్లు అబార్షన్‌ చేయించాడు. బాధితురాలికి తెలియకుండానే రూ. 60 లక్షలకు టోకరా వేసి ఉడాయించాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఘరానా మోసగాడు కటకటాలపాలయ్యాడు.

ఈ సంఘటన గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది.  సీఐ ఆర్‌.శ్రీనివాస్‌ తెలిపిన మేరకు..   మధ్యప్రదేశ్‌కు చెందిన అఖిలేష్‌ గుజార్‌ అలియాస్‌ తేజస్‌ అలియాస్‌ తేజ పటేల్‌ అలియాస్‌ తన్మయ్‌(36) కొండాపూర్‌లోని శుభం బోటానికల్‌ అపార్ట్‌మెంట్లో నివాసం ఉంటున్నాడు. ఆర్మీలో సీక్రేట్‌ ఏజెంట్‌గా పని చేస్తున్నాని భారత్‌ మ్యాట్రిమోనిలో తప్పుడు వివరాలు, ఆర్మీ డ్రెస్‌లో ఉన్న ఫొటోలను అఖిలేష్‌ ఉంచాడు.

హైటెక్‌సిటీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేసే పూజ నిజమేనని నమ్మి 2018 మే నెలలో కూకట్‌పల్లిలోని ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకుంది. తెలియకుండా పూజ పేరిట సిటీ బ్యాంక్‌లో రూ. 15 లక్షలు రుణం, బజాజ్‌ పైనాన్స్‌లో రూ.12 లక్షలు, ఇండియన్‌ బుల్‌లో రెండు లక్షలు, అమెక్స్‌ క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా రూ. 4.91 లక్షలు, ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు ద్వార రూ.2.71 లక్షలు, ఎస్‌బీఐ సేవింగ్‌ అకౌంట్‌ నుంచి రూ.5.61 హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచవల్‌ ఫండ్‌ ద్వారా రూ.10 లక్షలు, బంగారు ఆభరణాలు తీసుకొని చెప్పాపెట్టకుండా ఉడాయించాడు. అంతకు ముందు రెండు సార్లు పూజ గర్భం దాల్చగా తెలియకుండా ట్యాబ్‌లెట్లు వేసి ఒకసారి, బలవంతంగా మరో సారి అబార్షన్‌ చేయించాడు.

భర్త కనిపించకుండా పోయేసరికి బాధితురాలు గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడికి మధ్యప్రదేశ్‌లో భార్య, ఏడేళ్ల సంవత్సరాల కొడుకు ఉన్నట్లు తేల్చారు. ఇప్పటికే నలుగురిని పెళ్లి చేసుకొని మోసం చేసినట్లు నిర్ధారించారు. మ్యాట్రిమోనియాలో తప్పుడు వివరాలు ఇచ్చి యువతుల వివరాలు, ఫోన్‌ నెంబర్‌ తెలుసుకుంటాడు. శారీరక సంబంధాలు పెట్టుకొని, డబ్బులు దండుకొని మోసగిస్తుంటాడు. ఇప్పటి వరకు దాదాపు 15 మంది యువతులను మోసం చేశారని సీఐ తెలిపారు. నిందితుడిని సోమవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు