ఐదేళ్ల చిన్నారిపై కీచకపర్వం

16 Jul, 2019 06:33 IST|Sakshi
ఈశాని మృతదేహం (ఇన్‌సెట్‌) చిన్నారి ఈశాని (ఫైల్‌)

వృద్ధుడు సహా ముగురు పోలీసుల అదుపులోకి

అభం శుభం తెలియని చిన్నారికి ఆశ మాటలు చెప్పారు.. మిఠాయిలు ఇప్పిస్తామని తీపి మాటలు చెప్పి నమ్మించారు.. ఆ మానవ మృగాలు చెప్పిన మాటల వెనుక ఉన్న మర్మాన్ని పసిగట్టలేని చిన్నారి వారితో వెళ్లింది. చిన్నారిపై అత్యాచారానికి ఒడిæగట్టి ఆపై హత్య చేసి ఆ తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చారు.

చెన్నై, తిరువళ్లూరు: ఇటుకబట్టి వద్ద ఆడుకుంటున్న చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి ఆపై హత్య చేసి ఇంటి సమీపంలో పడేసిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ఒడిశా రాష్ట్రం కొలడై జిల్లా కలియగుండలం గ్రామానికి చెందిన అమిత్‌ (34). ఇతను భార్య అవంతి, వీరికి ఈశాని అనే ఐదేళ్ల  కుమార్తె ఉంది. దంపతులు తిరువళ్లూరు జిల్లా వెళ్లవేడులోని ఇటుకబట్టీలో పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం యథావిధిగా పనికి వెళ్లారు. మధ్యాహ్నం తర్వాత ఇంటికి వచ్చిన అమిత్, అతని భార్య అవంతి నిద్రకు ఉపక్రమించారు. ఇంటి వద్ద ఆడుకుంటున్న ఈశాని సాయంత్రం కనిపించలేదు. భార్యభర్తలిద్దరూ తమ కుమార్తె కోసం గాలింపు చేపట్టారు. రాత్రంతా గాలించినా ఫలితం కనిపించలేదు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఈశానీ మృతదేహం ఇంటికి సమీపంలో కనిపించింది. చిన్నారి ముఖంపై తీవ్ర గాయాలు ఉండడంతో పాటు జననాంగం వద్ద రక్తస్రావంతో చిన్నారి అచేతనంగా పడి ఉండడాన్ని చూసి తల్లిదండ్రులు బోరున రోదించారు. చిన్నారి హత్యకు సంబంధించి ఇటుకబట్టీలోని కొందరు వెళ్లవేడు పోలీసులకు సమాచారం అందించారు. వెళ్లవేడు ఇన్‌స్పెక్టర్‌ వెంకటేషన్‌తో పాటు పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. రాంబో డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి విచారణ చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం తిరువళ్లూరు వైద్యశాలకు తరలించారు.

పోలీసుల అదుపులో నలుగురు: చిన్నారి దారుణహత్యకు గురైనట్టు నిర్ధారించిన పోలీసులు ఆమెపై అత్యాచారం చేసి ఉండొచ్చన్న అనుమానంతో విచారణ ముమ్మరం చేశారు. అక్కడ పనిచేస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన విక్రమ్, చంద్రవానన్, నిలక్కర్‌తో పాటు 56 ఏళ్ల వృద్ధుడిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో విక్రమ్, చంద్రవానన్, నిలక్కర్‌లు చిన్నారిని తరచూ చాక్లెట్‌లు తీసి ఇస్తామని చెప్పి బజారుకు తీసుకెళ్లేవారని తెలిసింది. వీరే ఆదివారం సాయంత్రం బజారుకు తీసుకెళ్లారని, ఆపై మద్యం మత్తులో రాత్రి ఇంటికి వచ్చారని నిర్ధారించిన  పోలీసులు, చిన్నారికి చాక్లెట్‌ ఆశచూపి తీసుకెళ్లి అత్యాచారం చేయడంతో పాటు హత్య చేసి ఇంటికి సమీపంలో పడేసి ఉంటారని ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. ఈ సంఘటనపై బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణనూ ముమ్మరం చేశారు.

మరిన్ని వార్తలు