యువతికి మత్తుమందిచ్చి సామూహిక అత్యాచారం

15 Nov, 2018 11:27 IST|Sakshi
మహిళా సంఘాల ఆందోళన

మహిళా సంఘాల ఆందోళన

తమిళనాడులో దారుణం

సాక్షి ప్రతినిధి, చెన్నై: దీపావళి విందు అంటూ యువతిని ఇంటికి ఆహ్వానించాడు. మత్తుమందు కలిపిన పానీయం ఇచ్చి తన నలుగురు స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడిన సంఘటన నిందితుని అరెస్ట్‌తో ఆలస్యంగా వెలుగుచూసింది. తమిళనాడు రాష్ట్రం తంజావూరు జిల్లా కుంభకోణంకు చెందిన 21 ఏళ్ల యువతి ఒక వస్త్ర దుకాణంలో పనిచేస్తోంది. యువతి పనిచేస్తున్న దుకాణానికి సమీపంలోని పట్టుచీరల వ్యాపారి చిన్నప్ప(43)తో వృత్తిపరమైన పరిచయం ఏర్పడింది. దీపావళి పండుగ సందర్భంగా ఈనెల 8వ తేదీన దుకాణాలకు సెలవు కావడంతో సదరు చిన్నప్ప ఆ యువతికి ఇంటికి వెళ్లి తన ఇంటిలో పండుగ ప్రత్యేక విందు కార్యక్రమం ఉందని ఆహ్వానించాడు.యువతిని తన బైక్‌లో తీసుకెళ్లాడు. అయితే ఇంటికి తాళం వేసి ఉండడంతో ఇదేమని ప్రశ్నించిన యువతికి విందు ముగిసింది. భార్యాపిల్లలు ఇప్పుడే వస్తారని మభ్యపెట్టి తాళం తీసి లోపలికి తీసుకెళ్లాడు.

ఆ తరువాత ఆపిల్‌ జ్యూస్, కూల్‌డ్రింక్‌ ఇచ్చాడు. వాటిని తాగిన యువతి కొద్దిసేపటికే మత్తులోకి జారుకుంది. మధ్యాహ్నం 11 గంటలకు అతని ఇంటికి వెళ్లిన యువతి మధ్యాహ్నం 3 గంటలకు స్పృహలోకి రాగానే ఇంటికి వెళ్లిపోయింది. అయితే ఆ మరుసటి రోజు నుంచి తీవ్ర అస్వస్థతకు లోనుకావడంతో యువతి తల్లి కుంభకోణంలోని ఒక ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా సామూహిక అత్యాచారానికి గురైనట్లు వైద్యులు తెలిపారు. యువతి మర్మాంగానికి వైద్యులు తొమ్మిది కుట్లు వేశారు. యువతి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కుంభకోణం మహిళా పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న చిన్నప్పను మంగళవారం అరెస్ట్‌చేశారు. అయితే పోలీసు విచారణలో చిన్నప్ప, మరో వస్త్ర వ్యాపారి సహా మొత్తం ఐదుగురు అత్యాచారానికి పాల్పడినట్లు తేలింది. దీంతో నిందితులందరినీ అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం స్థానిక ప్రజలు, మహిళా సంఘాలు నిరసన ర్యాలీ నిర్వహించారు. వ్యాపారులు తమ దుకాణాలను మూసివేసి మద్దతు ప్రకటించారు.

మరిన్ని వార్తలు