అర్ధరాత్రి ప్రేమ జంట కిడ్నాప్‌యత్నం

10 Mar, 2020 02:56 IST|Sakshi

బలవంతంగా తీసుకెళ్లేయత్నం

సినీ ఫక్కీలో వెంబడించి పట్టుకున్న పోలీసులు

తెలంగాణ ప్రాంతానికి చెందిన జంటగా గుర్తింపు

సాక్షి, మచిలీపట్నం: ఆదివారం రాత్రి 11 గంటలు దాటింది.. కృష్ణా జిల్లా మచిలీపట్నం బస్టాండ్‌.. ఓ యువజంట బస్టాండ్‌ టేబుల్‌పై కూర్చుంది. నలుగురు వ్యక్తులు మెరుపు వేగంతో వచ్చి ఆ జంటను చుట్టుముట్టారు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే బలవంతంగా ఈడ్చు కుంటూ విజయవాడ బస్సు ఎక్కించారు. మాట్లాడకుండా వారి నోరు నొక్కేశారు. ఇంతలో తన స్నేహితుడిని బస్సు ఎక్కించేందుకు బస్టాండ్‌కు వచ్చిన మచిలీపట్నం పీఆర్వో జాకబ్‌ ఆ జంటకు ఏ ఆపద వచ్చిందోనని బస్సును ఆపే ప్రయత్నం చేశారు. సాధ్యం కాకపోవడంతో ‘సాక్షి’రిపోర్టర్‌కు సమాచారం ఇచ్చారు. తర్వాత ఫోన్‌లో పోలీసులకు చెప్పడంతో నైట్‌ పెట్రోలింగ్‌ చేస్తున్న పామర్రు పోలీసులు సినీ ఫక్కీలో బస్సును వెంబడించారు.

ఆ జంటతో పాటు వార్ని బలవంతంగా తీసుకెళ్తున్న ఆ నలుగురు వ్యక్తులను బస్సు నుంచి అదుపులోకి తీసుకున్నారు. ఆరా తీయగా, వారు తెలంగాణ రాష్ట్రం కొత్తగూడెం ప్రాంతానికి చెందిన వారని గుర్తించారు. నాలుగు రోజుల క్రితం పారిపోయి బందరు ప్రాంతానికి వచ్చారు. ఎక్కడా ఆశ్రమం దొరక్కపోవడంతో రాత్రి పూట బస్టాండ్‌లో తలదాచుకునే వారని పోలీసుల విచారణలో గుర్తించారు. ప్రేమికులను తీసుకెళ్లేందుకు వచ్చిన వారిని మందలించారు. కొత్తగూడెం పోలీసులకు సమాచారం ఇచ్చి వారిని ఆ రాష్ట్రానికి ప్రత్యేక వాహనంలో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.

మరిన్ని వార్తలు