జ్యోతిర్మయ్ డే కేసులో ఛోటా రాజన్‌కు జీవిత ఖైదు

2 May, 2018 14:56 IST|Sakshi
గ్యాంగ్‌స్టర్‌ ఛోటా రాజన్‌, జర్నలిస్ట్‌ జే డే

సాక్షి, ముంబై :  ఏడేళ్ల కిందట దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ప్రముఖ జర్నలిస్టు జే డే(జ్యోతిర్మయ్ డే) హత్య కేసులో ముంబై  ప్రత్యేక న్యాయస్థానం ఈ రోజు(బుధవారం) తీర్పు వెలువరించింది. ఈ కేసులో గ్యాంగ్‌స్టర్‌ ఛోటా రాజన్‌ని దోషిగా తేల్చిన కోర్టు ...అతడితో పాటు మరో ఏడుగురికి జీవిత ఖైదు విధించింది. ముంబైకి చెందిన జే డే.. మిడ్‌ డే పత్రికలో క్రైమ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 2011 జూన్‌11న విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా సుబర్బన్ పొవాయ్ ప్రాంతంలో  ఆయనపై మోటార్ సైకిళ్లపై వచ్చిన కొందరు వ్యక్తులు ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ జే డేని ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు.

ప్రముఖ క్రైమ్‌ రిపోర్టర్‌ అయిన జే డే ముంబైలో నేరచరిత్ర కలిగిన 20 మంది గ్యాంగ్‌స్టర్‌ల గురించి సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే అతను హత్యకు గురయ్యారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న మహారాష్ట్ర పోలీసులు తొలుత మరో జర్నలిస్టు జిగ్నా వోరాను ఈ కేసులో నిందితురాలిగా అనుమానించి విచారణ చేపట్టారు. వృత్తి రీత్యా ఏర్పడిన శత్రుత్వంతోనే వోరా ఈ హత్య చేసి ఉంటారని భావించిన పోలీసులు ఆమె వద్ద నుంచి మరింత సమాచారం సేకరించారు. 

ఆ తర్వాత లోతైన విచారణ చేపట్టిన పోలీసులు ఛోటా రాజన్‌కు వ్యతిరేకంగా వార్తలు ప్రచురించడంతోనే అతడు ఈ హత్య చేశాడనే నిర్ధారణకు వచ్చారు. సతీశ్‌ కాలియా అనే కాంట్రాక్టు కిల్లర్‌కు 5 లక్షల రూపాయలు ఇచ్చి ఈ హత్య చేయించినట్టు పోలీసు విచారణలో వెలుగు చూసింది. ఈ హత్య తర్వాత అక్కడి నుంచి పరారైన సతీశ్‌ను పోలీసులు ఎట్టకేలకు రామేశ్వరంలో అరెస్ట్‌ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ముంబై ప్రత్యేక న్యాయస్థానం బుధవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో తొలి నుంచి నిందితురాలిగా ఉన్న వోరాను కోర్టు నిర్ధోషిగా ప్రకటించింది. ఈ కేసులో ఛోటా రాజన్‌తో పాటు మరో పది మందిని దోషులుగా తేల్చిన న్యాయస్థానం వీరికి రేపు శిక్ష ఖరారు చేసే అవకాశం ఉంది. నకిలీ పాస్‌పోర్టు కేసులో దోషిగా ఉన్న ఛోటా రాజన్‌ ప్రస్తుతం తీహార్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.  

మరిన్ని వార్తలు