రోడ్డు ప్రమాదంలో నయీం మేనకోడలు దుర్మరణం 

13 Jan, 2020 03:53 IST|Sakshi

పలు కేసుల్లో నిందితురాలిగా షాహీనా 

సాక్షి, నల్లగొండ: గ్యాంగ్‌స్టర్‌ నయీం మేనకోడలు (నయీం సోదరి సలీమా బేగం కుమార్తె) సాజీదా షాహీనా (35) ఆదివారం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైంది. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి–అద్దంకి రహదారిలో మిర్యాలగూడ వైపు వెళ్తున్న లారీని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో ఆమె ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. వివరాలు.. సాజీదా షాహీనా, ఆమె భర్త మహ్మద్‌ అబ్దుల్‌ హైదరాబాద్‌ హయత్‌నగర్‌ సమీపం కుంట్లూరులో నివాసముంటున్నారు. నల్ల గొండలో గృహ ప్రవేశానికి వచ్చిన షాహీనా.. మధ్యలో మిర్యాలగూడ వెళ్లి వస్తానని చెప్పి కారులో బయలుదేరింది.

మధ్యాహ్నం 3.30 గంటలకు కారును సొంతంగా డ్రైవ్‌ చేసుకుంటూ మిర్యాలగూడ వైపు వెళ్తుండగా ముందు వెళ్తున్న లారీని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో 120 కిలోమీటర్ల వేగంతో బలంగా ఢీకొట్టింది. దీంతో కారు పల్టీలు కొడుతూ రోడ్డు పక్కకు వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. కారులో ఇరుక్కుపోయిన షాహీనా మృతదేహాన్ని పోలీసులు బయటికి తీసి ప్రభుత్వాస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. గ్యాంగ్‌స్టర్‌ నయీం ఎన్‌కౌంటర్‌ అనంతరం పలు కేసుల్లో ఆమె జైలుకు వెళ్లి వచ్చింది. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
 

మరిన్ని వార్తలు