రూ.7 కోట్ల గంజాయి పంటకు నిప్పు

13 Jan, 2018 10:29 IST|Sakshi

సాక్షి, మల్కన్‌గిరి:  చిత్రకొండ సమితి తర్లకోట పంచాయతీ కొల్లాగుడ గ్రామ సమీప అడవుల్లో సాగు చేస్తున్న గంజాయి మొక్కలను బలిమెల ఐఐసీ సుమిత్రా జెన్నా సిబ్బందితో వెళ్ళి ధ్వంసం చేశారు. కొల్లాగుడ అడవుల్లో మావోయిస్టుల సహకారంతో గిరిజనులు సుమారు 15 ఎకరాల్లో గంజాయి మొక్కలను సాగు చేస్తున్నారు.

మావోయిస్టుల ప్రభావంతో ఆ ప్రాంతానికి ఇదివరలో ఎవరూ వెళ్లేవారు కాదు. అయితే ఇటీవల పోలీస్‌ దళాలు కూంబింగ్‌ విస్తృతంగా నిర్వహిస్తుండడంతో వారి కంటబడుతున్న గంజాయి తోటలను గుర్తించి సమచారం తెలియజేస్తుండడంతో అటవీశాఖ అధికారులు, పోలీస్‌ సిబ్బంది దాడి చేసి గంజాయి మొక్కలను కాల్చి ధ్వంసం చేస్తున్నారు.

ఎన్నోసార్లు గిరిజనులను హెచ్చరిస్తున్నా మావోయిస్టుల అండతో గంజాయి సాగును యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. దీంతో​ పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది దాడులు చేస్తున్నారు. ఇటీవల కాలంలో వరుస దాడులతో సుమారు రూ.15కోట్ల విలువైన సాగును ధ్వంసం చేశారు. శుక్రవారం కాల్చివేసిన గంజాయి సాగు విలువ సుమారు రూ.7 కోట్లు ఉండవచ్చని పోలీస్‌ అధికారి తెలియజేశారు. 

మరిన్ని వార్తలు