రూ. కోటి విలువైన గంజాయి పట్టివేత!

12 Jul, 2019 08:26 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

దుద్దెడ టోల్‌గేట్‌ సమీపంలో డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం

రాజమండ్రి నుంచి జహీరాబాద్‌ మీదుగా మహారాష్ట్రకు..

నిందితులు, వాహనాన్ని హైదరాబాద్‌కు తరలింపు 

సాక్షి, సిద్దిపేట: గుట్టుగా రవాణా చేస్తున్న రూ. కోటి విలువ చేసే గంజాయిని సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ టోల్‌గేట్‌ సమీపంలో కేంద్ర ఇంటలీజెన్సి అధికారులు పట్టుకున్నట్లు జిల్లాలో గురువారం ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని రాజమండ్రి నుండి సుమారు 962 కేజీల గంజాయిని ఖమ్మం, సూర్యాపేట, జనగామ నుండి సిద్దిపేట సమీపంలోని దుద్దెడ మీదుగా జహీరాబాద్‌ అక్కడి నుంచి హారాష్ట్రకు తరలిస్తున్నట్లు సమాచారం.

ఈ విషయం తెలుసుకున్న డీఆర్‌ఐ(డైరెక్టర్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటలెజెన్సీ) అధికాలు దు ద్దెడ టోల్‌గేట్‌ సమీపంలోని జనగామ క్రాస్‌ రోడ్డు వద్ద గంజాయి రవాణా చేస్తున్న వాహనాన్ని అడ్డుకున్నట్లు తెలుస్తోంది. అందులో రూ. కోటికి పైగా విలువచేసే గంజాయి ఉండటంతో రవాణా చేస్తున్న వారిని, వాహనాన్ని నేరుగా హైదరాబాద్‌కు తరలించినట్లు సమాచారం.

రాజమండ్రి, ఇతర ప్రాంతాల నుంచి గంజాయి మహారాష్ట్రకు తరచుగా రవాణా అవుతుందని, ఖమ్మం, సూర్యాపేట, జనగామ, సిద్దిపేట జి ల్లాల మీదుగా జహీరాబాద్‌ అక్కడి నుంచి మహారాష్ట్రకు సులభంగా తరలించే అవకాశం ఉన్నందున ఎవ్వరికి అనుమానం రాకుండా ఈ దందా జరుగుతుందని జిల్లాలో ప్రచారం జరుగుతోంది. గురువారం ఏకంగా రూ. కోటి విలువచేసే గంజాయి రవాణా అవుతూ పట్టుబడిన విషయం జిల్లా పోలీస్, ఎక్సైజ్‌ అధికారులకు కూడా తెలియకపోవడంపై జిల్లాలో చర్చ సాగుతోంది. 

మరిన్ని వార్తలు