సిలిండర్‌ పేలి ఇద్దరు మృతి

10 May, 2020 12:42 IST|Sakshi

సాక్షి, కుప్పం(చిత్తూరు): చిత్తూరు జిల్లా కుప్పం మండల తంబీగానిపల్లిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్యాస్‌ సిలిండర్‌ పేలిన ఘటన.. పలువురి కుటుంబాల్లో విషాదన్ని నింపింది. ఆదివారం ఉదయం తంబీగానిపల్లిలో గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఇద్దరు వ్యక్తులు ఆక్కడిక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. పేలుడు దాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండటంతో అక్కడి పరిస్థితి భయానకంగా మారింది. 

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తంబీగానిపల్లిలోని ఓ వెల్డింగ్‌ షాప్‌లో ఓ వాహనానికి వెల్డింగ్‌ చేస్తుండగా ఒక్కసారిగా గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యయి. పేలుడు సంభవించగానే స్థానికులు భయంతో పరుగుల తీశారు. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లాక్‌డౌన్‌తో చాలా రోజులు వెల్డింగ్‌ షాప్‌ తీయకపోవడం, ఈ క్రమంలోనే అక్కడ ఉన్న గ్యాస్‌ లీకవ్వడంతోనే ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని పోలీసులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.  లాక్‌డౌన్‌ తర్వాత పలు దుకాణాలు తెరిచేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. 

మరిన్ని వార్తలు