మహిళకు తీవ్రగాయాలు
ఆదిలాబాద్ ,నస్పూర్ (మంచిర్యాల): శ్రీరాంపూర్ క్రిష్ణాకాలనీలోని కేడి–323 క్వార్టర్లో బుధవారం ఉదయం గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు వెలువడిన ఘటనలో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. మందమర్రి ఏరియాలోని కేకే–1 గనిలో కార్మికునిగా పనిచేసే మేకల మల్లేష్ భార్య సంధ్యారాణి ఇంట్లో దసరా పండుగకు బంధువులు రావడంతో పిండి వంటలు చేయడానికి సిద్ధమయ్యారు. మూకుడులో నూనె వేడి చేస్తుండగా గ్యాస్ అయిపోయింది. మరో సిలిండర్ను అమర్చి స్టౌ వెలిగిస్తుండగా ఒక్కసారిగా మంటలు లేచి ఇల్లంతా వ్యాపించాయి.
దీంతో ఇంట్లో ఉన్నవారంతా ఒక్కసారిగా బయటకు పరుగుతీశారు. వంటగదిలో చిక్కుకున్న సంధ్యారాణి కేకలు వేయడంతో స్థానికులు వంటగది వెనుక కిటికీని ఊడదీసి ఆమెను బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన సంధ్యారాణిని రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ఇంట్లోని ఫ్రిజ్, ఇతర సామానులు పూర్తిగా కాలిపోయాయి. ప్రమాద స్థలాన్ని సింగరేణి సూపర్బజార్ డీఎం ముకుంద సత్యనారాయణ సందర్శించి కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆర్ఐ మాధవిలత పంచనామ నిర్వహించారు.