అత్యాచార వీడియోపై పోలీసుల దర్యాప్తు

14 May, 2018 11:02 IST|Sakshi

పట్నా : మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడటమే కాకుండా.. అందుకు సంబంధించిన వీడియోలను కూడా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు మృగాళ్లు. తాజాగా కొందరు యువకుల ముందే  ఓ మహిళపై వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతే కాకుండా ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. గత వారం నుంచి ఈ వీడియో వైరల్‌గా మారింది. అయితే బిహార్‌ పోలీసులు దీన్ని సీరియస్‌గా తీసుకున్నారు. అందులోని సంభాషణల ఆధారంగా ఆ ఘటన బిహార్‌లోని మగధ ప్రాంతంలో జరిగి ఉంటుందని  భావిస్తున్నారు. గయా పోలీస్‌ స్టేషన్‌లో ఈ ఘటనపై జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

దీనిపై గయా ఎస్పీ రాజీవ్‌ మిశ్రా మాట్లాడుతూ.. ‘నేరం ఎక్కడ జరిగింది, బాధితురాలు ఎవరన్నది తెలియలేదు. కానీ డీఐజీ ఆదేశాలతో ఆదివారం కేసు నమోదు చేశాం. మగధ ప్రాంతంలోని అన్ని జిల్లాలకు ఈ కేసుకు సంబంధించిన వివరాలు అందించడం జరిగింది.. పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుంది. ఒక వేళ ఈ నేరం వేరే జిల్లాలో జరిగినట్లు తెలిస్తే ఈ ఎఫ్‌ఐఆర్‌ను అక్కడి పోలీస్‌ స్టేషన్‌కు తరలిస్తాం’ అని తెలిపారు.

ఇటీవల గయా సమీపంలోని జెహానాబాద్‌లో ఓ బాలికపై వేధింపులకు పాల్పడిన వీడియో కూడా వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన పోలీసులు ఆ ఘటనతో సంబంధం ఉన్న 13 మందిని అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం అదే తరహలో ఈ కేసులో నిందితులను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు