లింగ నిర్ధారణ చేస్తున్న వైద్యుల అరెస్ట్‌

29 Aug, 2018 09:13 IST|Sakshi

ఉప్పల్‌: ఉప్పల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో లింగ నిర్ధారణ చేస్తూ అడ్డంగా షీ టీమ్‌కు దొరికారు. ఉప్పల్‌ సరస్వతి కాలనీకి చెందిన డాక్టర్లు సింగిరెడ్డి ఉమామహేశ్వరి, డాక్టర్‌చంద్రశేఖర్‌   శ్రీకృష్ణ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. ఆస్పత్రిలో లింగ నిర్ధారణతో పాటు ఆడ పిల్లని తేలితే ఆపరేషన్లు చేస్తున్నారని సమాచారం అందుకున్న షీ టీమ్స్‌ పోలీసులు రంగంలోకి దిగారు. సైబరాబాద్‌ షీ టీమ్స్‌ అడిషనల్‌ డీసీపీ సలీమా, ఉప్పల్‌ వైద్యాధికారి డాక్టర్‌ పల్లవి ఆధ్వర్యంలో  మంగళవారం ఉదయం డెకాయ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు.

ఇందుకు గర్భిణి మహిళా కానిస్టేబుల్‌తో కలిసి మధ్యవర్తి ద్వారా ఉప్పల్‌ సరస్వతి కాలనీలోని శ్రీకృష్ణ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలోకి వెళ్లి లింగ నిర్ధారణ చేయాలని ఆస్పత్రి యాజమాన్యాన్ని కోరారు. ఇందుకు అంగీకరించిన డాక్టర్లు ఉమామహేశ్వరీ, చంద్రశేఖర్‌రావులు గర్భిణీ వద్ద రూ.7500 తీసుకొని లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి మగ పిల్లాడనే సర్టిఫికేట్‌ను అందజేశారు. అప్పటికే సమీపంలో మాటేసిన షీ టీమ్స్‌ అధికారులు, వైద్యాధికారులు, ఉప్పల్‌ పోలీసులు రంగంలోకి దిగి లింగ నిర్ధారణ యంత్రంతో పాటు వారు ఉపయోగించిన సెల్‌ఫోన్లు, రూ.7500 సీజ్‌ చేశారు. డాక్టర్‌ ఉమామహేశ్వరీ, డాక్టర్‌ చంద్రశేఖర్‌లను అదుపులోకి తీసు కొ న్నారు. కొంతకాలంగా ఈ ఆస్పత్రిలో లింగ నిర్ధారణ చేస్తున్నట్లు పోలీస్‌ విచారణలో తేలింది. ఉప్పల్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు