భార్య, పిల్లలను చంపిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌

22 Apr, 2019 18:50 IST|Sakshi

ఘజియాబాద్‌ : ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఉద్యోగం కోల్పోయి, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ భార్యతో పాటు ముగ్గురు పిల్లలను దారుణంగా హత్య చేశాడు. పైగా తానే వారిని చంపినట్టు ఓ వీడియో చిత్రీకరించి ఫ్యామిలీ వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్ట్‌ చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఘజియాబాద్‌లోని  ఇందిరాపురంలో నివాసముండే  సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కుమార్ (34) గత డిసెంబర్‌లో ఉద్యోగం కోల్పోయాడు. అప్పటి నుంచి ఆర్థిక ఇబ్బందులతో సతమతవుతున్నాడు. ఈ నేపథ్యంలో కుటుంబాన్ని పోషించలేక భార్య అన్షు బాలా(32), వారి ఐదేళ్ల కుమారుడు ప్రత్మేష్, కవలలు ఆరవ్, ఆకృతిలను ఆదివారం దారుణంగా చంపాడు. ఆత్మహత్య చేసుకోవడానికి పోటాషియం సైనేడ్‌ కొనుగోలు చేసినట్లు వెల్లడించిన వీడియోను కుమారి సోదరి చూసి ఇందిరాపురంలోనే ఉండే తమ బంధువు పంకజ్‌ సింగ్‌కు సమాచారం అందించింది. దీంతో వెంటనే అతను అక్కడికి పరిగెత్తాడు.

తాను అక్కడికి వెళ్లేసరికి ఇంటి తలుపు తాళం వేసి ఉందని, పోలీసులకు సమాచారం అందించడంతో.. వారు వచ్చి తలుపులు పగలగొట్టారాని పంకజ్‌ సింగ్‌ తెలిపారు. లోపలికి వెళ్లి చూస్తే.. తన సోదరి, ముగ్గురు చిన్నారులు కత్తిపోట్లతో అక్కడ పడి ఉన్నారన్నారు. అన్షు బాలాకు కుమార్‌తో 2011లో వివాహం జరిగిందని, స్థానికంగా ఓ ప్లే స్కూల్లో అన్షుబాలా టీచర్‌గా పనిచేస్తుందన్నారు. గతేడాది డిసెంబర్‌లో ఉద్యోగం వదిలిపెట్టినప్పటి నుంచి కుమార్ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడని, కుటుంబంతో పాటు తల్లిదండ్రులను కూడా అతనే పోషిస్తున్నాడని సింగ్‌ చెప్పుకొచ్చారు. ఈ వారం అతని తల్లిదండ్రులు బంధువుల పెళ్లి నిమిత్తం వేరే ఊరికి వెళ్లారని, ఫ్లాట్‌లో కుమార్‌తో పాటు అతని భార్యా, పిల్లలు మాత్రమే ఉన్నారని వారిని హత్య చేసి కుమార్ పరారయ్యాడని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టమన్నారు.

మరిన్ని వార్తలు