-

పగతో భోజనంలో విషం కలిపిన విద్యార్థిని

18 Jul, 2018 16:05 IST|Sakshi

గోరఖ్‌పూర్‌: తన తమ్ముడి చావుకు కారణమైన వారిపై పగ తీర్చుకునేందుకు స్కూల్‌లోని మధ్యాహ్న భోజనంలో విషం కలిపిందో విద్యార్థిని. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌ లోని గోరఖ్‌పూర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోరఖ్‌పూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ప్రతిరోజు లాగే మధ్యాహ్న భోజనం తయారు చేస్తున్నారు. ఇదే స్కూల్‌లో ఏడవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఆ భోజనంలో విషం కలిపింది. భోజనంలో ఏదో కలిసిందని అనుమానం వచ్చిన వంట మనుషులు విషయాన్ని స్కూల్‌ టీచర్ల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్కూల్‌ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులతో పాటు ఫుడ్‌ సేఫ్టీ అధికారులు పాఠశాలకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ చర్యకు పాల్పడిన ఆ బాలికతో పాటు ఆమె తల్లిని ప్రశ్నించారు. అయితే సదరు విద్యార్థిని మాత్రం తాను విషం కలపలేదని చెబుతోంది. భోజనం శాంపుల్స్‌ను ల్యాబ్‌కు పంపిన పోలీసులు.. రిపోర్టులు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

కాగా, బాలిక విషం ఎందుకు కలిపిందని ఆరా తీయగా ఆశ్యర్యకర విషయాలు తెలిశాయి. మూడు నెలల క్రితం అదే స్కూల్‌లో చదువుతున్న బాలిక తమ్ముడ్ని మరో విద్యార్థి ఇటుక రాయితో దాడి చేశాడు. దీంతో అతను మృతిచెందాడు. ఇక అప్పటి నుంచి బాలిక పగ పెంచుకుందని కొంతమంది విద్యార్థుల అంటున్నారు. తమ్ముడి మృతికి ప్రతీకారంగానే భోజనంలో విషం కలిపి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు