ప్రియుడు మోసగించాడు..మరో యువకుడు రక్షించాడు!

30 Mar, 2019 11:52 IST|Sakshi
బాలికను కాపాడిన నవీద్‌ను అభినందిస్తున్న సీఐ

సాక్షి, భైంసాటౌన్‌: ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని ఓ బాలిక (17) ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన భైంసాలో జరిగింది. పట్టణ సీఐ శ్రీనివాస్‌ కథనం ప్రకారం భైంసా మండలం మహాగాం గ్రా మానికి చెందిన ఓ బాలిక శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో గడ్డెన్నవాగు ప్రాజెక్టు చేరుకుని నీళ్లలో దూకి ఆత్మహత్యాయత్నాకి పాల్పడిం ది. అప్పుడే అక్కడ ఈత కొడుతున్న పట్టణానికి చెందిన షేక్‌ నవీద్‌ అనే యువకుడు బాలిక నీటిలో దూకడం గమనించి వెంటనే ఆమెను రక్షించి ఒడ్డుకు చేర్చాడు.

తర్వాత పోలీసులకు సమాచారమివ్వగా, ఘటనాస్థలికి చేరుకున్న సీఐ శ్రీనివాస్‌ ఆమెను పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బా లిక నీటిలో దూకే ముందు తన చావుకు శ్రీకాంత్‌ అనే వ్యక్తి కారణమంటూ రాసిన లెటర్‌ లభించింది. ఆ లెటర్‌లో తనది మహాగాం గ్రామమని, అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్‌ తనను ప్రేమించానంటూ మోసం చేశాడని రాసి ఉంది. బాలికను ప్రాణాలకు తెగించి రక్షించిన నవీద్‌ను పట్టణ సీఐ శ్రీనివాస్‌ అభినందించారు. బాలికను తల్లిదండ్రులకు అప్పగించినట్లు సీఐ తెలిపారు.  

మరిన్ని వార్తలు