ప్రేమ పేరిట బ్లాక్‌మెయిల్‌

10 Mar, 2019 09:36 IST|Sakshi

మైనర్‌ బాలికను మోసం  చేసిన యువకుడు

ఫొటోలు తీసి చెప్పినట్లు చేయాలని బెదిరింపులు

నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు  

బన్సీలాల్‌పేట్‌: మైనర్‌ బాలికను ప్రేమించి మోసం చేసి ఆమెతో సన్నిహితంగా ఉన్నపుడు తీసిన ఫొటోలను చూపించి బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్న ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాంధీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ సంఘటన గురించి డీసీపీ శనివారం విలేకరులకు వివరించారు. బషీర్‌బాగ్‌ చంద్రానగర్‌ ప్రాంతానికి చెందిన నాగరాజు (19), దోమల్‌గూడ మైసమ్మబండ ప్రాంతానికి చెందిన మైనర్‌ బాలిక సంవత్సర కాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమెతో సన్నిహితంగా ఉన్నపుడు నాగరాజు ఫొటోలు తీశాడు. వాటిని చూపించి బ్లాక్‌మెయిల్‌ చేశాడు. తాను చెప్పినట్లు చేయకపోతే ఫొటోలను బహిర్గతం చేస్తానని బెదిరించాడు. దీంతో బాలిక తన స్నేహితులకు విషయం చెప్పింది.

ఈ నెల 6న నాగరాజు బాలికను డీబీఆర్‌ మిల్స్‌ ప్రాంతానికి రావాలని కోరాడు. డీబీఆర్‌మిల్స్‌ ప్రాంతానికి వెళ్లిన స్నేహితులు నాగరాజును చిదకబాది అతని ఫోన్‌లోని ఫొటోలను తొలగించారు. విషయం బయటకు రావడంతో  ఇద్దరూ ఈ నెల 7న ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీంతో బాలిక తండ్రి 8న గాంధీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు బాలిక కోసం వెతకడం ప్రారంభించారు. అయితే శుక్రవారం మధ్యాహ్నం బాలిక నెక్లెస్‌ రోడ్డులో ఉన్నట్లు సమాచారం రావడంతో తమ సిబ్బంది వెళ్లి బాలిక స్టేషన్‌ తీసుకు వచ్చి విచారించామన్నారు.  అనంతరం నాగరాజును అదుపులోకి తీసుకొని విచారించారు. బాలిక అందరితో చనువుగా ఉండటం నచ్చలేదని అందుకే బ్లాక్‌ మెయిల్‌ చేశానని యువకుడు ఒప్పుకున్నాడన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. విలేకరుల సమావేశంలో చిక్కడ్‌పల్లి ఏసీపీ నర్సింహ్మారెడ్డి, సీఐ శ్రీనివాస్, క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రమోద్‌కుమార్, ఎస్‌ఐలు బాలక్రిష్ణ, అజయ్‌కుమార్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు