మైనర్‌ బాలికపై దారుణం

25 Apr, 2019 19:47 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చండీగఢ్‌ : పంజాబ్‌లో 15 ఏళ్ల బాలికపై దుండగులు దారుణానికి ఒడిగట్టారు. బాలికపై లైంగిక దాడి అనంతరం హత్య చేసి మృతదేహాన్ని దగ్ధం చేశారని బాధితురాలి తల్లితండ్రులు ఆరోపించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పటియాలా జిల్లా పంత్రా ప్రాంతంలో రెండు రోజుల కిందట బాలికను అపహరించిన దుండగులు ఆమెపై లైంగిక దాడికి పాల్పడి పాశవికంగా హత్య చేశారు. చతా గోవింద్‌పురా గ్రామంలో పాక్షికంగా దహనమైన బాధితురాలి మృతదేహాన్ని బుధవారం పోలీసులు గుర్తించారు.

కాగా సోమవారం కిడ్నాప్‌కు గురైన బాలిక ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో పంత్రా పోలీస్‌ స్టేషన్‌లో కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. బొటిక్‌లో పనిచేసే తన కుమార్తెను దీపు, రష్పాల్‌ అనే వ్యక్తులు వెంటపడుతూ నిత్యం వేధించేవారిని బాలిక తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా అటాప్సీ నివేదిక వచ్చిన తర్వాత ఆమెపై లైంగిక దాడి జరిపి హత్య చేశారా అనేది నిర్ధారిస్తామని పోలీసులు తెలిపారు. మరోవైపు మైనర్‌ బాలిక హత్యపై స్ధానికులు ఆందోళనలు చేపట్టి నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలని నిరసనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది.

మరిన్ని వార్తలు