తండ్రి మందలించాడని.. బాలిక బలవన్మరణం

25 May, 2019 08:21 IST|Sakshi

డబీర్‌పురా: తండ్రి మందలించాడని మనస్తాపానికిలోనైన ఓ  బాలిక ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన డబీర్‌పురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ శేఖర్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.చంచల్‌గూడ ప్రాంతానికి చెందిన ఇమ్రాన్‌ కుమార్తె హుదా ఖాతూన్‌ (13) ఎనిమిదో తరగతి చదువుతోంది. తండ్రి డ్యూటీకి వెళ్లిన సమయంలో ఆమె అతడి యాక్టివా తీసుకుని బయటికి వెళ్లేది. గురువారం కుమార్తె బైక్‌ నడుపుతుండటాన్ని చూసిన ఇమ్రాన్‌ ఆమెను మందలించాడు. దీంతో మనస్తాపానికిలోనైన హుదాఖాతూన్‌ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

యువతి ఆత్మహత్య...
చాదర్‌ఘాట్‌: ఉరి వేసుకుని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చాదర్‌ఘాట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బీదర్‌కు చెందిన అమ్రీన్‌ (20) ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తూ తండ్రి తో కలిసి ఆజంపురా చమన్‌లో నివాసం ఉంటోంది. గురువారం తండ్రి బీదర్‌కు వెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉన్న అమ్రీన్‌ సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు