ట్రాక్టర్‌ కిందపడి బాలిక దుర్మరణం

20 May, 2020 13:19 IST|Sakshi
వాణి(ఫైల్‌)

కట్టంగూర్‌ ( నకిరేకల్‌) :  ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ ట్రాలీ కిందపడి ఓ బాలిక దుర్మరణం చెందింది. ఈ ఘటన మండలంలోని పరడ గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అదే గ్రామానికి చెందిన మార్త వాణి(15) తన తల్లిదండ్రులు, అక్కయ్యతో కలిసి వ్యవసాయబావి వద్దకు వెళ్లింది. అక్కడ పనులు ముగించుకుని నలుగురు నడుచుకుంటూ ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యలో అదే దారిగుండా గ్రామంలోకి వెళుతున్న  లింగయ్యట్రాక్టర్‌ ఎక్కి ఇంజన్‌ మడ్‌గర్‌రేకుల మీద కూర్చున్నారు. అదే దారిలోని జోలం ఎర్రయ్య బావి సమీపంలోకి రాగానే వర్షం మొదలైంది. ఆ సమయంలో బాటపై ఉన్న రాయిని   ఇంజన్‌ పెద్ద టైర్‌ ఎక్కడంతో మడ్‌గర్‌ రేకుపై ఉన్న వాణి కిందపడింది. ఈ క్రమంలో ట్రాలీ టైరు బాలికపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నకిరేకల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి వెంకటనర్సింహారెడ్డి  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ జీ. కరుణప్రసాద్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు