రెండేళ్ల పాప దుర్మరణం
ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలో ఘటన
మృత చిన్నారి నూజెండ్ల మండలం బుర్రిపాలెం వాసి
శోకసంద్రంలో తల్లిదండ్రులు
దర్శి: గుర్తు తెలియని వాహనం ఢీకొని జిల్లాకు చెందిన రెండేళ్ల బాలిక ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలో మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాల మేరకు.. నూజెండ్ల మండలం బుర్రిపాలేనికి చెందిన పందుల బాబురావు, రూతమ్మ ప్రకాశంలో జిల్లాలోని తూర్పు వీరాయపాలెంలోని రూతమ్మ తల్లిదండ్రుల ఇంటికి వచ్చారు. వారి కుమార్తె కీర్తన(2) ఇంట్లో ఆటలాడుకుంటూ రోడ్డుపైకి వచ్చింది. ఈ సమయంలో గుర్తు తెలియని వాహనం బాలికను ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. ప్రమాదంలో తల రోడ్డుకు గుద్దుకోవడంతో బలమైన గాయం తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. 108కు ఫోన్ చేయగా వారు అక్కడికి చేరుకుని పరిశీలించి కీర్తన మృతి చెందినట్లు నిర్ధారించారు.