కన్నతండ్రే కీచకుడిగా మారి..

22 Jun, 2018 08:49 IST|Sakshi

న్యూఢిల్లీ : మైగ్రేన్‌ కోసం చికిత్స పొందుతున్న 17 ఏళ్ల బాలిక తన తండ్రి పెడుతున్న చిత్రహింసలను వైద్యుడికి వివరించడంతో దారుణ ఘటన వెలుగు చూసింది. బిహార్‌లో కుటుంబంతో కలిసి నివసిస్తున్న బాలిక ఢిల్లీలోని సఫ్ధర్‌జంగ్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వచ్చింది. ఈ క్రమంలో తండ్రి నుంచి ఎదరవుతున్న ఇబ్బందులను ఏకరవు పెట్టింది. గత కొన్నేళ్లుగా నిద్రించే సమయంలో తండ్రి తనను లైంగికంగా వేధిస్తున్నాడని, తాను అడ్డుకున్న ప్రతిసారీ తీవ్రంగా కొడుతున్నాడని వైద్యుడికి తెలిపింది.

ఫోన్‌లో అభ్యంతరకర ఫొటోలను తీశాడని అప్పటినుంచి తనను మైగ్రేన్‌ తీవ్రంగా బాధిస్తోందని బాధితురాలు వెల్లడించింది. దీంతో వైద్యుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధిత బాలిక తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లైంగిక వేధింపులు బాధితులపై మానసికంగా తీవ్ర ప్రభావం చూపుతాయని సైకాలజిస్టులు పేర్కొన్నారు. లైంగిక వేధింపులు ఎదుర్కొనే చిన్నారులు తీవ్ర కుంగుబాటు (డిప్రెషన్‌)లోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కాగా చిన్నారులపై లైంగిక దాడుల్లో నిందితులు 84 శాతం వారి కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులేనని ఢిల్లీ పోలీసులు 2016లో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.

మరిన్ని వార్తలు