తోటి విద్యార్థుల వేధింపులు భరించలేక..

9 Jan, 2018 02:52 IST|Sakshi

ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకున్న బాలిక మృతి

జిన్నారం/గుమ్మడిదల (పటాన్‌చెరు): తోటి విద్యార్థుల వేధింపులకు మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించి చివరికి కన్నుమూసింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామంలో చోటు చేసుకుంది. శ్రీశైలం, పుణ్యవతి దంపతుల కూతురు లావణ్య తోటి విద్యార్థుల వేధింపులతో మనస్తాపానికి గురై వారం క్రితం ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఆమెను వెంటనే హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు.

వారం రోజులు మృత్యువుతో పోరాడిన లావణ్య సోమవారం కన్నుమూసింది. లావణ్య బొంతపల్లి గ్రామంలోని ప్రైవేట్‌ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆమె తరగతికే చెందిన ఇద్దరు విద్యార్థులు నెల రోజులుగా సూటిపోటి మాటలతో వేధించారు. ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోకపోవడంతో చివరికి ఆత్మహత్యకు యత్నించింది. లావణ్య కుటుంబీకులు పాఠశాల యాజమాన్యంతో ఈ విషయమై గొడవకు దిగగా పోలీసులు సర్ది చెప్పారు. 

మరిన్ని వార్తలు