విద్యార్థిని కాటేసిన మృత్యువు

16 Aug, 2018 11:39 IST|Sakshi
మృతి చెందిన దీపిక  

దుస్తులు ఉతికేందుకు వెళ్లి పాముకాటుకు గురైన చిన్నారి

సంతబొమ్మాళి : స్వాతంత్య్ర దినోత్సవానికి వెళ్లి ఇంటికి చేరిన విద్యార్థిని దుస్తులు ఉతికేందుకు బావి వద్దకు వెళుతుండగా పాము కాటుకు గురై బుధవారం మృతిచెందింది. మండలంలోని రొంకు గ్రామానికి చెందిన టంకాల దీపిక(12) జగన్నాథపురం ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. పాఠశాలలో జరిగిన  స్వాతంత్య్ర దినోత్సవానికి వెళ్లి తిరిగి స్వగ్రామం చేరుకుంది. దుస్తులు ఉతికేందుకు తన అక్కను తోడు తీసుకుని గ్రామంలో ఉన్న బావి వద్దకు వెళ్లింది.

ఈ క్రమంలో మార్గమధ్యంలో పాము కాటు వేసింది. మంటిబుక్కడం(విషం లేని పాము) అనుకుని బావి వద్దకు చేరుకుని దుస్తులు ఉతకడం ప్రారంభించింది. కొద్ది సేపటికే దీపిక నోటి నుంచి నురుగలు రావడంతో స్థానికులు అంబులెన్స్‌లో కోటబొమ్మాళి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందింది. తండ్రి అప్పన్న గత ఏడాదే మృతిచెందడంతో తల్లి అమ్ములు కూలీ చేసి పిల్లలను చదివిస్తున్నారు. దీపిక మృతి చెందడంతో బంధువులు విలపిస్తున్న తీరు అందరినీ కలిచివేసింది.

మరిన్ని వార్తలు