హైదరాబాద్‌లో ప్రియాంక.. కాంచీపురంలో రోజా..

29 Nov, 2019 19:57 IST|Sakshi

సాక్షి, చైన్నై : దేశంలో మృగాళ్లు రెచ్చిపోతున్నారు. చట్టాలంటే భయంలేకుండా మహిళలపై అత్యాచారాలకు పాల్పడి.. కిరాతకంగా అంతమొందిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంకారెడ్డి తరహాలోనే.. తమిళనాడు కాంచీపురంలో రోజా అనే యువతి హత్యకు గురైంది. గత శనివారం కనిపించకుండా పోయిన రోజా.. కాలిన గాయాలతో ముళ్ల పొదల్లో శవమై గురువారం కనిపించారు. అయితే రోజా మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. 

వివరాల్లోకి వెళితే..  ఆండిసిరువలూర్‌ గ్రామానికి చెందిన భూపతి కుమార్తె రోజా (20) చెన్నై సమీపంలోని శ్రీపెరంబదూరులో ఉన్న ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు.  గత శనివారం విధులకు వెళ్లిన రోజా తిరిగి ఇంటికి రాలేదు. రోజా కోసం గాలించిన కుటుంబ సభ్యులకు ఆమె లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పెరంబదూరు సిరువాక్కంలో రోజా మృతదేహాం కొయ్యకు వేలాడుతూ అనుమానస్పద స్థితిలో కనిపించింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రోజా మృతదేహాన్ని శవపరీక్ష కోసం కాంచీపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

రోజా ఒంటి కాలిన గాయాలు ఉండటంతో.. పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  రోజాపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడి అంతమెందించినట్టుగా కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. దుండగులపై చర్యలు తీసుకోవాలని ఆమె తల్లిదండ్రులు, బంధువులు కాంచీపురం–బెంగళూరు రోడ్డుపై ఆందోళన చేపట్టారు. కాగా, యువతి మృతదేహాం లభించిన ప్రాంతం ఓ రాజకీయ నాయకుడిదని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నామని వెల్లడించారు. రోజా చివరిసారిగా ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న రాజేశ్‌తో(30) మాట్లాడుతూ కనిపించిందని.. అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని తెలిపారు.

సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌..
రోజా మృతిపై సోషల్‌ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్యాగ్‌తో రోజాపై దాడికి పాల్పడి.. హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ట్విటర్‌లో జస్టిస్‌ ఫర్‌ ప్రియాంక, జస్టిస్‌ ఫర్‌ ప్రియాంక హ్యాష్‌ ట్యాగ్‌లు ట్రెండ్‌ అవుతున్నాయి.

మరిన్ని వార్తలు