సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మహిళలు, బాలికలపై లైంగిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా నోయిడా సమీపంలోని దస్తంపూర్ గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసిన ఇద్దరు వ్యక్తులు బలవంతంగా ఆమెతో మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. ఈనెల 24న బాధితురాలు కుట్టు శిక్షణకు హాజరై ఇంటికి తిరిగివస్తుండగా ఇద్దరు నిందితులు ఆమెను అపహరించి, మద్యం తాగించి దారుణానికి పాల్పడ్డారని జెవార్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్ఎస్ భాటి పేర్కొన్నారు.
నిందితులను ప్రతిఘటించిన బాధితురాలిని తీవ్రంగా గాయపరిచారని చెప్పారు. బాలికపై లైంగిక దాడికి పాల్పడిన అనంతరం మరుసటి రోజు దస్తంపూర్ గ్రామంలోని ఆమె ఇంటి వద్ద విడిచిపెట్టి వెళ్లారని పోలీసులు తెలిపారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితులపై పోస్కో, ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశామని వెల్లడించారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.