పెళ్లి సాకుతో అత్యాచారం ఆపై..

6 May, 2020 20:38 IST|Sakshi

జార్ఖండ్‌లో వెలుగు చూసిన దారుణ ఘటన

రాంచీ : పెళ్లి పేరుతో యువతిని వంచించి, అత్యాచారానికి పాల్పడి, ఆపై పలుమార్లు అబార్షన్లు చేయించిన ఘటన జార్ఖండ్‌ రాష్ట్రంలోని లోహర్‌దగా జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లోహర్‌దగా జిల్లా కురుబ్లాక్‌కు చెందిన ఓ యువతి చదువు నిమిత్తం అమ్మమ్మగారి ఊరైనా సెన్హా ఏరియాలో నివాసం ఉంటోంది. ఇదే ప్రాంతలో శివరాజ్‌పూర్‌ గ్రామానికి చెందిన యువకుడు  అజిత్‌ కూడా నివాసముంటున్నాడు. చదువు విషయంలో సహాయం చేసే క్రమంలో వీరిద్దరికి స్నేహం ఏర్పడింది. కాలక్రమంలో ఆ స్నేహం కాస్త క్రమంగా ప్రేమగా మారింది. ( చదవండి : ఢిల్లీలో ‘బాయ్స్‌ లాకర్‌ రూమ్‌’ వికృత చర్చలు)

పెళ్లి చేసుకుంటానని చెప్పి యువతిపై అజిత్‌ గత రెండేళ్లుగా పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి గర్భం దాల్చడంతో పలుమార్లు అబార్షన్‌ కూడా చేయించాడు. కాగా, ఇటీవల యువతి మరోసారి గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకోవాలని అజిత్‌ని పట్టుబట్టింది. పెళ్లికి నిరాకరించిన అజిత్‌.. అక్కడి నుంచి పరారయ్యాడు.దీంతో మోసపోయానని తెలుసుకున్న యువతి సెన్హా పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని పోలీసులు తెలిపారు. నిందితుడు పరారిలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకొని విచారణ చేస్తామని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు