ప్రేమ వేధింపులతో బాలిక ఆత్మహత్య

17 May, 2019 22:09 IST|Sakshi

సాక్షి, చెన్నై : 17 ఏళ్ల బాలికపై ప్రేమ పేరుతో వేదింపులకు పాల్పడడంతో ఆమె ఆత్మహత్య చేసుకోగా యువకుడితో సహా బాలుడిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. తిరుప్పూర్‌ ఆండిపాళయంకు చెందిన మణికంఠన్‌ (22). ఇతని ఇంటి ఎదురుగా 17 ఏళ్ల బాలిక తల్లిదండ్రులతో నివసిస్తోంది. స్నేహభావంతో ఇరు కుటుంబాల సభ్యులు ఒకరి ఇంటికి ఒకరు వచ్చి వెళ్లేవారు. ఎదురింటిలో ఉంటున్న మణికంఠన్‌ వద్దకు శివశక్తినగర్‌కు చెందిన 16 ఏళ్ల బాలుడు వచ్చి వెళ్లేవాడు. ఇతను మణికంఠన్‌ ఇంటికి ఎదురుగా నివసిస్తున్న బాలికతో పరిచయం ఏర్పరచుకుని చనువుగా ప్రవర్తించాడు. దీంతో ఆమె ఆ బాలుడిని దూరంగా పెట్టింది. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆ బాలుడు ప్రేమ పేరుతో బాలికను వేధించసాగాడు.

దీంతో ఆ బాలిక తన కష్టాన్ని మణికంఠన్‌కు చెప్పుకుంది. అయితే, మణికంఠన్‌ కూడా ఈ సందర్భాన్ని అవకాశంగా తీసుకుని బాలికను ప్రేమ పేరుతో వేధించడం మొదలుపెట్టాడు. ఇద్దరు ప్రేమ పేరుతో తనను వేధించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ బాలిక రసాయన ద్రవాన్ని తాగి ఆత్మహత్య చేసుకుంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపి, బాలిక ఆత్మహత్యకు కారణమైన మణికంఠన్‌తో పాటు, 16 ఏళ్ల బాలుడిని కూడా బుధవారం అరెస్టు చేశారు.   

మరిన్ని వార్తలు