అలా అన్నందుకు వివస్త్రను చేశారు

4 Nov, 2017 13:05 IST|Sakshi

సాక్షి, పట్నా : చదువుకుంటా అన్న యువతిపై గ్రామస్తులు రాక్షసత్వం ప్రదర్శించారు. సభ్యసమాజం తలదించుకునేలా.. యువతి వివస్త్రను చేసి దారుణంగా కొట్టి హింసించారు. మానవత్వానికి మాయని మచ్చలాంటి ఈ ఘటన బీహార్‌లోని దర్భంగా పరిధిలోని బైరోలి గ్రామంలో జరిగింది. గ్రామస్తుల బెదిరింపులు లెక్క చేయకుండా తల్లిదండ్రుల అండతో దర్భంగాలోని ఒక యువతి బీఏ సెకెండ్‌ ఇయర్‌ చదువుతోంది. ఇది నచ్చని గ్రామస్తులు ఆ ఆమ్మాయిని పట్టపగలు గ్రామం నడిమధ్యలో వివస్త్రను చేసి లైంగికంగా వేధించి.. కర్రలతో కొట్టి మరీ హింసించారు.

గ్రామం మధ్యలో ఇంతటి దారుణం జరుగుతున్నా.. ఒక్కరంటే ఒక్కరు కూడా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. యువతి తండ్రి తన కుమార్తెకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించి.. గ్రామస్తుల చేతిలో చావుదెబ్బలు తిన్నారు. యువతి ఉన్నత చదువులు చదువడం ఇష్టంలేని గ్రామస్తులు ఇటువంటి నీచకృత్యానికి ఒడిగట్టారు.

తమకు జరిగిన అన్యాయంపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళితే.. పోలీసులు కూడా ఫిర్యాదు తీసుకోలేదని బాధిత యువతి తండ్రి తెలిపారు. చివరకు బాధితులు స్థానిక ఎస్‌ఎస్‌పీ సత్యవీర్‌ సింగ్‌ని కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించినట్లు ఆయన తెలిపారు. నిందితులపై సత్యవీర్‌ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంతో పాటు.. ఘటనకు ప్రధాన కారకులైన 13 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది.

మరిన్ని వార్తలు