హ్యాపీ బర్త్‌డే మమ్మీ.. ఐయామ్‌ సారి..!

31 May, 2019 18:26 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ముంబై : తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఓ యువకుడు.. అనంతరం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నాగ్‌పూర్‌లో శుక్రవారం వెలుగుచూసింది. వివరాలు.. మంథన్‌ మహేంద్ర చావన్‌ (19) ప్రైవేటు విమానయాన సంస్థ గోఎయిర్‌లో గ్రౌండ్‌ స్టాఫ్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబంతో కలిసి చంద్రమణి నగర్‌లో నివాసముంటున్నాడు. గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేనిది చూసి సీలింగ్‌కు ఉరివేసుకుని తనువు చాలించాడు. అఘాయిత్యానికి పాల్పడేముందు తన తల్లి పుట్టినరోజు సందర్భంగా ఓ పేపర్‌పై ‘హ్యాపీ బర్త్‌డే మమ్మీ, ఐయామ్‌ సారి’అని రాసిపెట్టాడు. అతని తల్లి పోలీష్‌ ఆఫీసర్‌. ఆమె నాగ్‌పూర్‌ స్పెషల్‌ బ్రాంచ్‌లో పనిచేస్తున్నారు.

తన కుమారుడు గత రెండు వారాలుగా జాండీస్‌తో బాధపడుతున్నాడని, సెలవుపై ఇంటివద్దనే విశ్రాంతి తీసుకుంటున్నాడని అతని తండ్రి చెప్పారు. చావన్‌ ఆత్మహత్యకు గల నిర్ధిష్ట కారణాలేంటో తెలియవని  అన్నారు. పనిఒత్తిడి కారణంగానే యువకుడు ప్రాణాలు తీసుకుని ఉండొచ్చని అజ్నీ పోలీస్‌ ఇన్స్‌పెక్టర్‌ కైలాష్‌ మగార్‌ అనుమానం వ్యక్తం చేశారు. ఘటనాస్థలిలో ఎలాంటి సూసైడ్‌ నోట్‌ లభించలేదని, తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని రాసిపెట్టిన చీటీ మాత్రమే దొరికిందని వెల్లడించారు. విచారణ చేపట్టామని అన్నారు. చావన్‌ గత 9నెలలుగా తమ సంస్థలో ట్రెయినీ రాంప్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడని గో ఎయిర్‌ తెలిపింది. ఉద్యోగి మరణంపట్ల దిగ్భాంతి వ్యక్తం చేసింది. కంపెనీ నిబంధనల ప్రకారం చావన్‌ కుటుంబానికి రావాల్సిన బకాయిలన్నీ చెల్లిస్తామని తెలిపింది.

మరిన్ని వార్తలు