అబ్రకదబ్ర..కుక్కర్‌లో బంగారం వేడి చేస్తే..!

9 Aug, 2019 07:32 IST|Sakshi

చిత్తూరు, గుడిపాల : నగలను శుభ్రం చేయిస్తామని నమ్మించి మూడు సవర్ల బంగారు చెయిన్‌ కొట్టేశార్రా నాయనా! అని ఓ మహిళ గొల్లుమంది. వివరాలు..మరకాలకుప్పం దళితవాడకు చెందిన మంజుల (40) ఇంటివద్దకు గురువారం ఉదయం 10.30 గంటలకు ఒక మఓటార సైకిల్‌లో ఇద్దరు ఆగంతకులు వచ్చారు. వారిద్దరూ హిందీలో మాట్లాడారు. మంజులను పిలిచి తాము బంగారు, వెండి వస్తువులు, నగలను తళతళలాడేలా శుభ్రపరుస్తామని చెప్పారు. దీంతో ఆమె తొలుత కాలి పట్టీలు ఇవ్వడంతో వారు శుభ్రం చేసి ఇచ్చారు. ఆ తరువాత తన మెడలో ఉన్న మూడుసవర్ల బంగారాన్ని వారికి ఇచ్చింది. ఆ గొలుసు కుక్కర్‌లో వేసి వేడి చేసి, కుక్కర్‌ చల్లబడ్డాక ఆ చెయిన్‌ను తీసుకుంటే కొత్త నగలా ఉంటుందని వారు ఊదరగొట్టారు.

ఇది నిజమే కాబోలని ఆ అమాయరాలు నమ్మింది. ఆ తర్వాత వారు అన్నట్లే ఆ చెయిన్‌ను కుక్కర్‌లో వేడి చేశారు. నగలు శుభ్రం చేసినందుకు ఆమె నుంచి కొంత డబ్బు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొంతసేపటికి కుక్కర్‌ చల్లబడడంతో నగ ఎలా మెరిసిపోతోందో చూద్దామని ఉత్కంఠతతో ఆమె కుక్కర్‌ మూత తీసి చూసింది. అంతే! గుండెల్లో రాయి పడ్డట్లైంది. అందులో చల్లారిన నీళ్లు తప్ప బంగారు చెయిన్‌ లేకపోవడంతో ఊరంతా తెలిసేలా శోకాలు పెట్టింది. ఆ జంతర్‌మంతర్‌ మాయగాళ్ల కోసం బంధువులతో గాలించింది. వాళ్లెప్పుడో జంప్‌ అయ్యారని బోధపడేసరికి ఈసారి పోలీస్‌ స్టేషన్‌కు పరుగులు తీసింది. ఎస్‌ఐ షేక్‌షావలి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు