ఆరు ఇళ్లల్లో చోరీ
4 తులాల బంగారం, నగదు అపహరణ
నాగోలు: ఓటు వేయడానికి సొంత ఊరికి వెళ్లడంతో దొంగలు పడి ఆరు ఇళ్లల్లో విలువైన వస్తువులు ఎత్తుకెళ్లిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సాగర్రింగ్రోడ్డు సమీపంలోని మల్లికార్జుననగర్ కాలనీలో ఉంటున్న నల్లగొండ జిల్లా, దేవరకొండ గొట్టిముక్కల గ్రామానికి చెందిన తిరుమలయ్య సోమవారం పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం స్వగ్రామానికి వెళ్లాడు. వీరి పక్కింట్లో ఉంటున్న మిర్యాలగూడకు చెందిన వెంకన్న నాయక్, అదే ప్రాంతంలో ఉంటున్న మంచెన్ రాజా, మోతిలాల్, శ్రీను కనీత్కమార్ కూడా ఇళ్లకు తాళం వేసి ఊళ్లకు వెళ్లారు.
దీనిని గుర్తించిన గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం ఆర్ధరాత్రి ఆరు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. తిరుమలయ్య ఇంట్లో 4 తులాల బంగారం, రూ. 20 వేల నగదు, వెంకన్న ఇంట్లో 8 గ్రాముల బంగారం అభరణాలు, వెండి వస్తువులు చోరీ చేశారుకి గురయ్యాయి. రాజా, మోతిలాల్, శ్రీను, కనీత్ల ఇళ్లల్లో చోరీకి యత్నించారు. సోమవారం ఉదయం దీనిని గుర్తించిన స్థానికులు తిరుమలయ్య, వెంకన్నకు సమాచారం అందించారు. ఎల్బీనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించగా అర్థరాత్రి 1:30 గంటల సమయంలో ఓ వ్యక్తి కాలనీలో సంచరిస్తున్నట్లు సీసీకెమెరాలో రికార్డు అయినట్లు సమాచారం. సంఘటన స్ధలాన్ని రాచకొండ క్రైమ్ డీసీపీ కేఆర్ నాగరాజు, ఎల్బీనగర్ ఏసీపీ పృధ్వీదర్రావు, ఎల్బీనగర్ సీఐ అశోక్రెడ్డి, డీఐ కృష్ణమోహన్ పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.