విమాన ప్రయాణికులకు కేజీహెచ్లో వైద్య పరీక్షలు
బంగారం స్మగ్లింగ్ చేస్తుండగా విశాఖ విమానాశ్రయంలో పట్టివేత
వారి దగ్గర నుంచి రూ. 2,33,600 విలువైన స్వర్ణం స్వాధీనం
ఇంకా బంగారం మింగేసి ఉంటారని పరీక్షలు
విశాఖపట్నం, గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): విశాఖ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు మరో మారు బంగారం స్మగ్లింగ్ గుట్టు రట్టు చేశారు. బంగారం బిస్కెట్లు అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురిని అరెస్టు చేశారు. వివరాలిలా ఉన్నాయి. విశాఖ విమానాశ్రయంలో శనివారం రాత్రి పది గంటలకు ఎయిర్ ఏషియా విమానం నుంచి తమిళనాడుకు చెందిన జహుబర్ సాధిక్ అజారుద్దీన్, జహుబర్ సాధిక్ షేక్ అబ్దుల్లా, నైనాఎండీ సయ్యద్లు బ్యాగులతో దిగారు. వీరు టాయ్లెట్ల వైపు వెళ్లటంతో కస్టమ్స్ అధికారులు అనుమానించి తనిఖీ చేశారు. వారి వద్ద రూ.2,33,600 విలువైన బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. మరింత బంగారం మింగేసి ఉంటారన్న అనుమానంతో వైద్య పరీక్షల నిమిత్తం కేజీహెచ్కి తరలించారు.