మత్తుమందుచల్లి నగలు దోచుకున్న దొంగలు

19 Jul, 2018 11:37 IST|Sakshi
బాధితురాలు భోగి విజయలక్ష్మి 

పార్వతీపురం : మత్తుమందు చల్లి మహిళ మెడలోని బంగారు ఆభరణాలు దోచుకున్న సంఘటన పార్వతీపురం పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. పట్టణంలోని ముత్తావారివీధికి చెందిన ఓ మహిళ ఇంటికి కొంతమంది వ్యక్తులు సర్ఫ్‌ అమ్మే వ్యక్తులుగా వచ్చి ఈ దారుణానికి ఒడిగట్టారు. బాధితురాలు భోగి విజయలక్ష్మి తెలియజేసిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 10 గంటల సమయంలో ఇద్దరు అపరిచిత వ్యక్తులు బంగారం, వెండి, ఇత్తడి, తదితర వస్తువులకు మెరుగు పెట్టే సర్ఫ్‌ ఉందని చెప్పారు.

దీంతో బాధితురాలు వారిని ఇంటిలోకి రమ్మంది. ఇంతలో తమకు దాహం వేస్తుందని మంచినీరు కావాలని అపరిచిత వ్యక్తులు మహిళను కోరారు.  ఇంటిలో నుంచి మంచినీరు తెచ్చేలోపు ఆమె వెనుకాల వెళ్లి ముక్కు వద్ద మత్తు మందు పెట్టి  3 తులాల బంగారం పుస్తులతాడు, 3 తులాల బంగారం చైన్, 2 తులాల  బంగారం గాజులను తీసుకొని  పరారయ్యారు. కొద్దిసేపటి తర్వాత మత్తు నుంచి బయటపడిన బాధితురాలు లబోదిబోమంటూ విషయాన్ని తన భర్త చక్రధర్‌కు ఫోన్‌ ద్వారా సమాచారం అందించింది. ఆయన సూచన మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.  

మరిన్ని వార్తలు