డబ్బుల కోసం నానమ్మను చంపేశాడు

2 Jun, 2020 08:09 IST|Sakshi
వివరాలు సేకరిస్తున్న పోలీసులు

మొయినాబాద్‌ మండలం శ్రీరాంనగర్‌లో ఘటన

నిందితుడు మైనర్‌ బాలుడు

మొయినాబాద్‌(చేవెళ్ల): ఓ బాలుడు డబ్బుల కోసం తన నానమ్మతో గొడవపడి ఆమె గొంతునులిమి హత్యచేశాడు. ఈ సంఘటన మొయినాబాద్‌ మండలం శ్రీరాంనగర్‌లో సోమవారం జరిగింది. ఎస్సై జగదీష్, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కావలి వెంకటమ్మ(65) కొడుకు కుమార్‌ కొన్నేళ్ల క్రితం మృతిచెందాడు. ఆమె కోడలు విజయ, ఇద్దరు మనవలు, మనువరాలితో కలిసి ఉండేది. రెండో మనవడు (16) పదో తరగతి వరకు చదివి గ్రామంలో కొంతకాలంగా ఖాళీగా తిరుగుతున్నాడు. డబ్బులు ఇవ్వాలంటూ తరచూ అతడు నానమ్మ వెంకటమ్మతో గొడవపడేవాడు. అయితే, ఆదివారం కోడలు విజయ, పెద్ద మనవడు, మనవరాలు బంధువుల వద్దకు వెళ్లారు. ఇంటి వద్ద ఉన్న బాలుడు డబ్బులు కావాలని వెంకటమ్మతో గొడవపడ్డాడు. ఈక్రమంలో రాత్రి 10 గంటల సమయంలో ఆమెతో మరోమారు ఘర్షణపడి బెల్టుతో కొట్టాడు. అనంతరం గొంతు నులిమేయడంతో ఆమె చనిపోయింది. మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి అనంతరం స్నేహితుడి ఇంటికి వెళ్లి నిద్రించాడు. సోమవారం ఉదయం నల్లా నీళ్లు వస్తున్నాయని చెప్పేందుకు పక్కింటి వారు వెళ్లి చూడగా వెంకటమ్మ విగతజీవిగా పడి ఉంది. సమాచారం అందుకున్న ఇన్‌స్పెక్టర్‌ జానయ్య, ఎస్సై జగదీష్‌ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.(బాలిక బలవన్మరణం)

పోలీసుల అదుపులో బాలుడు  
డబ్బుల కోసం నానమ్మను హత్య చేసిన బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంకటమ్మ మృతి విషయంపై గ్రామస్తులకు ఆమె చిన్న మనవడిపై అనుమానం వచ్చి అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. కాగా, వృద్ధురాలు హత్యకు బాలుడికి మరో ఇద్దరు యువకులు కూడా సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. విచారణలో పూర్తి వివరాలు రాబడతామని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు