మహా దావానలం.. 100 మంది మృతి

25 Jul, 2018 12:51 IST|Sakshi

ఏథెన్స్‌ : కార్చిచ్చు ఓ గ్రామాన్ని అతలాకుతలం చేసింది. కొన్ని గంటలపాటు పదుల సంఖ్యలో విమానాలు, హెలికాప్టర్ల ద్వారా ఫైర్‌ సిబ్బంది యత్నించి మంటల్ని అదుపులోకి తెచ్చినా అప్పటికే జరగాల్సిన జరిగిపోయింది. తొలుత 74 మంది మృతిచెందారని భావించినా.. ఆ సంఖ్య 100కు చేరుకోగా , మరో 1000 మందికి కాలిన గాయాలైనట్లు సమాచారం. చనిపోయిన వారిలో ఎక్కువగా వృద్ధులు, చిన్నారులు ఉన్నారు. ఈ భారీ అగ్ని ప్రమాదం గ్రీస్‌ రాజధాని ఏథెన్స్‌ సమీపంలోని రిసార్ట్‌ టౌన్‌ మాటీలో చోటుచేసుకుంది. సోమవారం నుంచి మంగళవారం వరకు అగ్నికీలలు నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. మంటల్ని అదుపులోకి తెచ్చినా.. పదే పదే అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయని గ్రీస్‌ అధికారులు వెల్లడించారు.

మంటలనుంచి తమ ప్రాణాలు రక్షించుకునేందుకు కొందరు బీచ్‌ల వైపు పరుగులు తీయగా, మరోవైపు కార్చిచ్చు వందల ఇళ్లు, కార్లు, ఇతర వాహనాలను బుగ్గి చేసింది. మాటీ గ్రామంలో 26 మంది అక్కడికక్కడే మంటల్లో ఆహుతైనట్లు స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. రెడ్‌క్రాస్‌కు చెందిన ఓ అధికారి మంగళవారం ఘటనకు సంబంధించి పలు విషయాలు తెలిపారు. వేడి కారణంగా అడవుల్లో ఏర్పడ్డ కార్చిచ్చు పట్టణాన్ని మొత్తం ఆహుతి చేసిందన్నారు. ఏథెన్స్‌ పరిధిలో జరిగిన ఈ దావానలం దేశాన్నే సంక్షోభంలో పడేసింది.  

ప్రాణభయంతో పర్యాటకుల పరుగులు
గ్రీస్‌ అందాలు చూద్దామనుకుని వస్తే బూడిదే మిగిలిందంటూ ఇక్కడికి వచ్చిన పర్యాటకులు వాపోతున్నారు. తమ కుటుంబసభ్యులను మంటలు సజీవదహనం చేస్తుంటే.. పరుగెత్తి మా ప్రాణాలు కాపాడుకోవడం తప్పా, ఏం చేయలేకపోయామంటూ మృతుల బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవదారు వృక్షాల్లో ఏర్పడ్డ చిన్న మంట.. కార్చిచ్చుగా మారి గ్రామాన్ని మొత్తం బూడిద చేసేశాయని, భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. దీంతో తమ ప్రాంతానికి తిరిగి వెళ్లేందుకు ఏం చేయాలో అర్థంకాక పలు దేశాలకు చెందిన పర్యాటకులు ఆందోళన చెందుతున్నారు.

ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వార్తలు