నిత్య పెళ్లికొడుకుపై ఫిర్యాదు

4 Jan, 2019 10:18 IST|Sakshi
బిడ్డ సహా రోడ్డుపై దీనావస్థలో ఉన్న గర్భిణి

చెన్నై , తిరువొత్తియూరు: ఐదుగురు యువతులను మోసగించి పెళ్లి చేసుకుని, ఆరో పెళ్లి చేసుకునేందుకు  మరో యువతితో పరారైన వ్యక్తిపై ఐదో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు..  దిండుక్కల్, తేనాంపట్టికి చెందిన మురుగన్‌ మల్లిక దుకాణం నడుపుతున్నాడు. అతనికి రాధ అనే యువతితో పరిచయమై ఇద్దరూ ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను రాధ కుటుంబసభ్యులు తిరస్కరించారు. రాధ తల్లిదండ్రులను వద్దనుకుని మురుగన్‌తో వెళ్లి వివాహం చేసుకుంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.

ఈ క్రమంలో వ్యాపారంలో నష్టం ఏర్పడడంతో భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. అప్పుల బాధ ఎక్కువ కావడంతో ఎక్కెడికైనా వెళ్లి డబ్బు  సంపాదించి తీసుకొస్తానని చెప్పి వెళ్లిన మురుగన్‌ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో రాధ భర్త కోసం అన్ని చోట్ల గాలించినప్పటికీ అతని ఆచూకీ తెలియలేదు. విచారణలో అతనికి ఇదివరకే నలుగురితో వివాహం అయ్యిందని, తాను ఐదో భార్య అని తెలియడంతో దిగ్భ్రాంతి చెందారు. ఇదిలాఉండగా మురుగన్‌ ఆరో పెళ్లి చేసుకునేందుకు మరో యువతితో కలిసి పరారైనట్టు తెలిసింది. దీంతో అయోమయంలో పడిన రాధ పుట్టింటికి వెళ్లగా ఆమె ప్రేమ వివాహం చేసుకోవడం నచ్చని తల్లిదండ్రులు ఆదరించలేదని తెలిసింది. దీంతో విరక్తి చెందిన రాధ కొన్ని రోజులుగా ఆలయంలో దీనావస్థలో గడుపుతోంది. ప్రస్తుతం గర్భిణిగా ఉన్న రాధ తనను మోసం చేసి పారిపోయిన భర్తపై వడమదురై పోలీసుస్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు