తప్పించుకు తిరుగువాడు.. 

30 May, 2019 04:02 IST|Sakshi

ముందస్తు బెయిల్‌ కోసం పెరుగుతున్న పిటిషన్లు 

అరెస్ట్‌ కాకుండా ఉండేందుకు కోర్టుల చెంతకు ఎలాగైనా పట్టుకోవాలనే పట్టుదలతో పోలీసులు 

ఇప్పటికే పలువురికి లుక్‌అవుట్‌ నోటీసులు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కేసుల విషయంలో పోలీసుల వ్యూహాలు ఫలిస్తున్నాయి. ఈ కేసుల్లో నిందితులంతా దేశం వదిలిపోకుండా ఇప్పటికే విమానాశ్రయాలు, షిప్‌యార్డుల్లో లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేసిన పోలీసులు వేట ముమ్మరం చేశారు. ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తుండటం, నిందితుల సన్నిహితులు, స్నేహితులపై నిఘా తీవ్రతరం చేస్తున్నారు. ఈ కేసుల్లో తప్పకుండా పురోగతి ఉంటుందని, వారిని తప్పకుండా పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బిజీగా ఉన్న పోలీసులు ఇప్పుడు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారు. దీనికితోడు మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో నిందితులకు వాతావరణం ప్రతికూలంగా మారుతోంది. దీంతో పోలీసుల చేతికి చిక్కకుండా ఉండేందుకు ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరం చేశారు. ఇప్పుడు తమ లాయర్ల ద్వారా కోర్టులను ఆశ్రయిస్తూ ముందస్తు బెయిళ్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రెండు కేసుల్లోను ముఖ్య నిందితులంతా.. ఏపీలో తలదాచుకున్నారన్న విమర్శలు రావడం, ఇప్పుడు రాజకీయంగా వారికి ప్రతికూల వాతావరణం ఏర్పడిందని సమాచారం. దీంతో ఆ ప్రాంతం తమకు అంత సురక్షితం కాదని భావించి ఇప్పటికే మరో చోటుకు మకాం మార్చారని సమాచారం. 

పట్టువదలని డాకవరం.. 
జాతీయస్థాయిలో సంచలనం రేపిన డేటా చౌర్యం కేసులో ప్రధాన నిందితుడు, ఐటీ గ్రిడ్‌ సంస్థ అధినేత డాకవరం అశోక్‌ అరెస్టును తప్పించేందుకు విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఈ కేసులో ఫిబ్రవరి 23 తర్వాత కేసు నమోదైంది. అప్పటికే డాకవరం రాష్ట్రం సరిహద్దులు దాటి పారిపోయాడు. అతనికి ఏపీలోని కొందరు ఆశ్రయమిచ్చినట్లు సమాచారం. పైగా అప్పటి ఏపీలోని ప్రభుత్వం పెద్దలు అశోక్‌కు బహిరంగంగా మద్దతివ్వడం కూడా చర్చనీయాంశమైంది. పోలీసులు తన కోసం గాలిస్తుండగానే.. అశోక్‌ మాత్రం హైకోర్టును ఆశ్రయించగా అక్కడ ఆయనకు చుక్కెదురైంది. దీంతో అశోక్‌ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. విచిత్రంగా మే 24 నుంచి ఈసారి ఎల్బీనగర్‌ కోర్టును ఆశ్రయించగా కోర్టు అతని అప్పీల్‌ను తిరస్కరించింది. దీంతో ఆయన తిరిగి బుధవారం హైకోర్టును ఆశ్రయించాడు. 

రవిప్రకాశ్‌ ఏకంగా సుప్రీంకే..! 
డేటాచౌర్యం, ఫోర్జరీ కేసులో పరారీలో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్, మరో నిందితుడు, సినీనటుడు శివాజీలు ఇప్పటిదాకా పోలీసులకు చిక్కలేదు. ఇప్పటికే రెండుసార్లు సీఆర్‌పీసీ సెక్షన్‌ 160, 41ఏల కింద 2 సార్లు నోటీసులు ఇచ్చినా.. ఇంతవరకూ పోలీసుల ఎదుట హాజరుకాలేదు. ముందస్తు బెయిలు కోసం 2 సార్లు హైకోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. తాజాగా రవిప్రకాశ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పోలీసులు ఆయనపైనా లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేసి దేశం వదిలిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ కేసులో రవిప్రకాశ్‌ ఇప్పటికే ఏపీ వదిలి ఉత్తరభారతానికి పారిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రత్యేక పోలీసు బృందాలు ఆయన కోసం గాలిస్తున్నాయి.  

మరిన్ని వార్తలు