నడిరోడ్డుపై నరికి చంపారు

21 Jan, 2019 20:01 IST|Sakshi

సాక్షి, చెన్నై: గంజాయి విక్రయాల విషయంలో పోటీ ఓ వ్యక్తి దారుణ హత్యకు దారితీసింది. చెన్నైలోని ఆరుబాక్కం వైష్ణవ కళాశాల ఎదురుగా ఉన్న కెనరా బ్యాంకు ఏటీఎం ముందు చోటు చేసుకున్న ఈ హత్యోదంతం సీసీటీవీలో రికార్డు అయ్యింది. చూలైమేడుకు చెందిన కుమరేశన్ అనే వ్యక్తి ఆ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్నట్లు పలు కేసులు నమోదయ్యాయి. అదే సమయం అతనిపై హత్య, హత్యాయత్నం తదితర కేసులు కూడా ఉన్నాయి.

కుమరేశన్‌కు అదే ప్రాంతంలో గంజాయి విక్రయించే ముఠాకు కొంతకాలంగా వర్గపోరు నడుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గతంలో కూడా కుమరేశన్‌పై హత్యాయత్నం జరిగ్గా తృటిలో తప్పించుకున్నట్టు తెలిసింది. సోమవారం కుమరేశన్‌ రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా ముగ్గురు వ్యక్తులు కత్తులతో నరికి చంపటం ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి సీసీటీవీ పుటేజ్ ఆదారంగా దర్యాప్తు చేస్తున్నారు.

గడిచిన రెండు రోజుల్లో చెన్నై నగరంలో నడిరోడ్డుపై నాలుగు హత్యలు జరగటం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. గుమ్మడిపూండి ప్రాంతంలో శనివారం రాత్రి ముగ్గురు యువకులను వెంటాడి నరికి చంపారు.

మరిన్ని వార్తలు