ప్రిన్సిపాల్ వేధింపులతో గెస్ట్ టీచర్ ఆత్మహత్యాయత్నం
పరవాడ గురుకుల కళాశాల సిబ్బంది తీరుపై మనస్థాపం
సాక్షి, పరవాడ(పెందుర్తి): ‘మేడం..మీరు ఇకపై ఎవరికీ నాపై ఫిర్యాదులు చేయనక్కరలేదు..నేను చనిపోతున్నాను’‘నాకు కళాశాలలో జరుగుతున్న అవమానాల వల్ల అమ్మానాన్న చాలా బాధపడుతున్నారు. వారి బాధను నేను చూడలేకపోతున్నాను..నేను చనిపోతాను’ అంటూ తన వాట్సాప్ స్టేటస్లో పేర్కొంటూ ఓ గెస్ట్ టీచర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పనిచేస్తున్న కళాశాల ప్రిన్సిపాల్, ఇతర సిబ్బంది వేదింపులు తాళలేకే ఊపిరి తీసుకునేందుకు సిద్ధమయ్యానని చెబుతోంది..పరవాడ మండలంలో సంచలనం రేపిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
పరవాడ మండలం వాడచీపురపల్లికి చెందిన మొల్లి అప్పలరాజు కుమార్తె రమ్య ఎమ్మెస్సీ కెమిస్ట్రీ వరకు చదువుకుంది. ఉపాధి నిమిత్తం పరవాడ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావ్ పూలే గురుకుల కళాశాలలో గెస్ట్ టీచర్గా పనిచేస్తోంది. గెస్ట్ టీచర్గా పనిచేస్తున్న వారిని ఏటా(నిబంధనల ప్రకారం 11 నెలలు మాత్రమే వీరు కొనసాగుతారు) కొత్తగా నియమించుకుంటారు. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా తిరిగి గెస్ట్ టీచర్గా రమ్యకు అవకాశం దక్కింది. అయితే కళాశాలలో పనిచేస్తున్న వైస్ ప్రిన్సిపాల్ నాగమణి, ఇతర సిబ్బంది రమ్యపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రిన్సిపాల్కు నూరిపోసేవారు.ఈ మాటలను ఇటీవలే కళాశాల ప్రిన్సిపాల్గా వచ్చిన శివరాం నమ్మి తరచూ రమ్యను మాటలతో వేదించేవాడు.
విద్యార్థులు, తోటి సిబ్బంది, గ్రామస్తుల సమక్షంలో సూటిపోటి మాటలు అనేవారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన రమ్య శనివారం అర్ధరాత్రి తన సెల్పోన్ వాట్సాప్ స్టేటస్లో తాను పడుతున్న బాధలను పెట్టింది. అనంతరం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కాసేపటికి కుటుంబసభ్యులు గమనించి నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రమ్యకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పరవాడ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు అందింది. మరోవైపు ఇదే కళాశాల ఆవరణలో ఉన్న పాఠశాలలో పనిచేస్తున్న మరో గెస్ట్ టీచర్ కూడా సిబ్బందిపై పరవాడ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.