అప్పు తీర్చమన్నందుకు పొడిచి చంపేశాడు..

28 Jul, 2019 13:03 IST|Sakshi

గాంధీనగర్‌: అప్పు తీసుకునేటప్పుడు ఎలాగున్నా తీర్చేటపుడు తాతలు దిగిరావాల్సిందే అంటుంటారు. కానీ ఇక్కడ ఆ సామెత వర్తించదు.. ఎందుకంటే అప్పు తీర్చమన్నందుకు తల్లీకూతుళ్ల ప్రాణాలను తీశాడో రైతు. ఈ దారుణం గుజరాత్‌లోని సురేంద్రనగర్‌ జిల్లాలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సురేంద్రనగర్‌లోని పరిశోత్తమ్‌ దోదియా రైతు సూర్య భట్‌, భవిక భట్‌ అనే తల్లీకూతుళ్ల దగ్గర లక్షల రూపాయల అప్పు తీసుకున్నాడు. ఎక్కువ వడ్డీ అయినా పర్వాలేదంటూ అప్పు కోసం ఇంటిని, పొలాన్ని కూడా తాకట్టు పెట్టి మరీ డబ్బులు తీసుకున్నాడు.

రోజులు గడుస్తున్నా దోదియా తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించలేదు. దీంతో తల్లీకూతుళ్లు అప్పు తీర్చమంటూ అతన్ని పదేపదే వేధించసాగారు. ఈ క్రమంలో శనివారం భవిక భట్‌ దోదియా ఇంటికి వెళ్లి ‘ఎన్నాళ్లవుతోంది.. అసలు అప్పు తీర్చే ఉద్దేశముందా.. లేదా? అంటూ రాద్దాంతం చేసింది. దీంతో కోపోద్రిక్తుడైన దోదియా కత్తి తీసుకుని చంపేస్తానంటూ ఆమె వెంట పడ్డాడు. వీధిలోకి పరిగెత్తిన భవికను అందిపుచ్చుకుని ఆమెపై కత్తితో పలుమార్లు దాడి చేశాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న పిమ్మట అదే ఆవేశంలో ఆమె తల్లిని చంపడానికి బయలుదేరాడు. అతని కారులో 5 కిమీ ప్రయాణించి వద్వాన్‌కు చేరుకుని ఆమె తల్లి సూర్యను కత్తితో కిరాతకంగా పొడిచి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు పట్టుకుని అరెస్ట్‌ చేశారు.

>
మరిన్ని వార్తలు