భార్య ఫ్యాషన్‌ షోలో పాల్గొన్నదని..

30 Apr, 2019 15:38 IST|Sakshi

చంఢీగడ్‌ : భార్య ఫ్యాషన్‌ షోలో పాల్గొనడం చూసి ఆగ్రహంతో ఊగిపోయిన ఓ వ్యక్తి తుపాకీతో ఆమె మీద దాడి చేసి గాయపర్చాడు. వివరాలు.. ఆశారాణి(32) అనే మహిళ గత కొద్ది నెలలుగా గురుగ్రామ్‌లోని ఓ పాఠశాలలో టీచర్‌గా పని చేస్తుంది. ఈ క్రమంలో గత ఆదివారం పాఠశాల యాజమాన్యం సిటీ క్లబ్‌లో టీచర్ల కోసం ఓ పార్టీని ఏర్పాటు చేసింది. దాంతో పాటు ఫ్యాషన్‌ షోని కూడా నిర్వహించింది. అయితే పార్టీకెళ్లే ముందు తాను కూడా ఫ్యాషన్‌ షోలో పాల్గొంటానని ఆశారాణి.. భర్త ఇందర్‌జిత్‌ను కోరింది. అందుకు అతను ఒప్పుకోలేదు. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ కూడా జరిగింది.

ఈ క్రమంలో పార్టీకెళ్లిన ఆశారాణి రాత్రి 11 గంటలు దాటిన ఇంటికి రాలేదు. దాంతో ఆమె భర్త పాఠశాలకు వద్దకు వెళ్లాడు. కానీ ఆమె అక్కడ కన్పించలేదు. దాంతో ఇందర్‌జిత్‌.. తన భార్యకు ఫోన్‌ చేసి గొడవపడ్డాడు. దాంతో ఆశారాణి పార్టీ జరుగుతున్న అడ్రస్ లోకేషన్‌ని వాట్సాప్‌ ద్వారా పంపించింది. పార్టీ జరుగుతున్న ప్రదేశానికి చేరుకున్న ఇందర్‌జిత్‌.. అక్కడ ఆమె ఫ్యాషన్‌ షోలో పాల్గొనడం చూశాడు. దాంతో వెంటనే ఆమెని తనతో పాటు ఇంటికి బయలుదేరమన్నాడు. కానీ అందుకు ఆమె ఒప్పుకోలేదు. దాంతో ఆగ్రహించిన ఇందర్‌జిత్‌.. వెంట తీసుకువచ్చిన గన్‌తో ఆమెపై దాడికి దిగాడు.

తొలుత తన భార్య ఫోటో కనిపిస్తున్న స్క్రీన్‌ను కాల్చేశాడు. అనంతరం భయంతో పరుగు తీస్తున్న ఆశారాణి కాలు మీద కాల్చాడు. ఇంత తతంగం జరుగుతున్నప్పటికి అక్కడ ఉన్న వారు ఎవరూ కూడా ఆమెను కాపాడే ప్రయత్నం చేయలేదు. క్లబ్‌లో పని చేసే ఓ వ్యక్తి ఈ సంఘటన గురించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆశారాణిని ఆస్పత్రిలో చేర్చి.. ఆమె వద్ద నుంచి స్టేట్‌మెంట్‌ తీసుకున్నారు. అనంతరం భర్త ఇందర్‌జిత్‌ మీద కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు