గుట్కాలు అమ్మితే చర్యలు తప్పవు

16 Apr, 2018 13:20 IST|Sakshi
నిందితుల అరెస్టును చూపుతున్న సీపీ విశ్వనాథ రవీందర్‌

వరంగల్‌ సీపీ విశ్వనాథ రవీందర్‌

రూ.11.97 లక్షల విలువైన గుట్కాల పట్టివేత

ఏడుగురు నిందితుల అరెస్ట్‌

వరంగల్‌ క్రైం: ప్రభుత్వం నిషేధించిన గుట్కాలను అమ్మితే జైలు శిక్ష తప్పదని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ విశ్వనాథరవీందర్‌ హెచ్చరించారు. ఆదివారం టాస్క్‌ఫోర్స్‌ అధికారులు.. గుట్కా వ్యాపారులను అరెస్ట్‌ చేయగా, నిందితుల వివరాలను సీపీ విశ్వనాథరవీందర్‌ వెల్లడించారు. గుట్కా లు విక్రయిస్తున్న వరంగల్‌ పోచమ్మమైదాన్‌కు చెందిన తిరుమల రమేష్, హసన్‌పర్తి మండలం వంగపహాడ్‌కు చెందిన శ్యాకురావ్‌ రఘు, మునుగు వేణు, ప్రసాద్, వరంగల్‌ రూరల్‌ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావికి చెందిన దేవులపల్లి రవి, చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లికి చెందిన అందె నాగరాజు, కాజీపేట మండలం భట్టుపల్లికి చెందిన కందగట్ల ప్రసాద్‌ అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.

నిందితుల్లో ఒకడైన కందగట్ల ప్రసాద్‌.. కరీమాబాద్‌లో ద్విచక్రవాహనంపై గుట్కా బ్యాగులను తరలిస్తుండగా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. అతడిని విచారించగా గిర్నిబావికి చెందిన రవి నుంచి గుట్కాలు కోనుగోలు చేసినట్లు తెలిపాడని పేర్కొన్నారు. రవి  స్నేహితుడు నాగరాజును విచారించగా నిందితుడు రమేష్‌ పేరును తెలిపాడని, రమేష్‌ గీసుకొండ మండలం కొమ్మలలో గుట్కాలను డెలివరీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇలా ఒక్కొక్కరిని విచారించగా 12 బ్యాగుల గుట్కాలను గుర్తించినట్లు సీపీ వివరించారు.

వాహనాలు స్వాధీనం..
వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో గుట్కా, పొగాకు ఉత్పత్తులను అమ్ముతున్న ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.5.97 లక్షల విలువైన గుట్కాలు, ఒక కారు, నాలుగు ద్విచక్ర వాహనాలు, రూ.11,400 నగదు, మొత్తం రూ.11.97 లక్షల సొమ్మును స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. గుట్కా ప్యాకెట్లు అమ్మితే కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ వెంకటరమణారెడ్డి, ఇన్‌స్పెక్టర్లు రమేష్‌కుమార్, మహేందర్‌రెడ్డి, కానిస్టేబుళ్లు శ్రీనాథ్, మంగీలాల్‌ను ఆయన అభినందించారు.

మరిన్ని వార్తలు