లేదు.. తెలియదు.. కాదు!

27 Dec, 2019 05:54 IST|Sakshi
కోర్టు నుంచి శ్రీనివాస్‌రెడ్డిని జైలుకు తరలిస్తున్న పోలీసులు

 జడ్జి ప్రశ్నలకు ఇదీ

సైకో శ్రీనివాస్‌రెడ్డి సమాధానం 

హాజీపూర్‌ కేసులో నిందితుడిని విచారించిన నల్లగొండ కోర్టు  

నల్లగొండ: ‘మనీషాను తీసుకెళ్లావా.. అత్యాచారం జరిపి హత్య చేసి బావిలో పూడ్చిపెట్టావా?’అన్న జడ్జి ప్రశ్నలకు ‘లేదు.. తెలియదు.. కాదు..’అని నిర్భయంగా సమాధానమిచ్చాడు సైకో శ్రీనివాస్‌రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామా రం మండలం హాజీపూర్‌ వరుస హత్యల కేసులో నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డిని గురువారం నల్ల గొండ మొదటి అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టులో విచారించారు. ముగ్గురు బాలికల హత్యలకు సంబంధించి 101మంది సాక్షుల వాంగ్మూలాలను కోర్టు ఇప్పటికే నమోదు చేసింది. ఈ క్రమంలో గురువారం మనీషా కేసుకు సంబంధించి నిందితుడి వాంగ్మూలం రికార్డ్‌ చేశారు.

ఒక్కో సాక్షి వాంగ్మూలాన్ని శ్రీనివాస్‌రెడ్డికి జడ్జి చదివి వినిపిం చారు. కాగా, వీటిపై జడ్జి అడిగిన ప్రశ్నలకు నిందితుడు తాపీగా ‘తెలియదు.. కాదు’అని జవాబు ఇచ్చాడు. హత్యకు గురైన బాలికల దుస్తులపై స్మెర్మ్‌ ఆనవాళ్లు నీకు సంబంధించినవేనని ఫోరెన్సిక్‌ రిపోర్టులో తేలింది కదా? అని అడగగా, ఎస్‌ఓటీ పోలీసులు సిరంజీలతో చల్లారని చెప్పుకొచ్చాడు. ఫోర్న్‌ చూస్తావా అన్న ప్రశ్నకు తన దగ్గర స్మార్ట్‌ ఫోన్‌ లేదని చెప్పాడు. మనీషా హత్య జరిగిన రోజు తన ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేశానని, అందుకే టవర్‌ లొకేషన్‌ ఆ ప్రాంతంలో చూపించిందని తెలిపాడు. కర్నూల్‌లో జరిగిన సువర్ణ హత్యపై అడగ్గా, ఆమె ఎవరో తనకు తెలియదని సమాధానం ఇచ్చాడు. కాగా, ఈ కేసు తదుపరి విచారణను జడ్జి జనవరి 3వ తేదీకి వాయిదా వేశారు.  

ఆగస్టులో చార్జ్‌షీట్‌ దాఖలు
గత ఏప్రిల్‌లో హాజీపూర్‌కు చెందిన శ్రావణి మిస్సింగ్‌ కేసుపై విచారణ చేస్తున్న పోలీసులు శ్రీనివాస్‌రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించగా శ్రావణితోపాటు కల్పన, మనీషాను కూడా అత్యాచారం చేసి చంపి పాతి పెట్టినట్టుగా ఒప్పుకున్నాడు. పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ ఆధ్వర్యంలో పోలీసులు సాక్ష్యాలన్నింటినీ పకడ్బందీగా సేకరించారు. ఆగస్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. నల్లగొండలోని ఫస్ట్‌ అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ సెషన్స్‌ కోర్టులో విచారణ సాగుతోంది. నవంబర్, డిసెంబర్‌ నెలల్లో వందమంది సాక్షులను విచారించారు.  కేసు విచారణ వారంరోజుల్లోగా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని పీపీ వెంకట్‌రెడ్డి తెలిపారు.  

కనిపించని ఆందోళన
కోర్టులో విచారణ సందర్భంగా జడ్జి అడిగిన ప్రతి ప్రశ్నకు నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి నిర్భయంగా సమాధానాలు చెప్పాడు. అతని ముఖంలో ఎటువంటి ఆందోళన కనిపించకపోవడం గమనార్హం.  
 

మరిన్ని వార్తలు