యూపీలో హృదయ విదారకర ఘటన

4 Jul, 2020 19:37 IST|Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో హృదయ విదారకరమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ మహిళను తన కుమారుడు హార్డోయి జిల్లాలోని సవాయిజౌర్‌ కమ్మూనిటీ ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. ఆస్పత్రి వెలుపల తన తల్లిని రక్షించాలని ఏడుస్తూ ఆస్పత్రి సిబ్బందిని వేడుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆస్పత్రి వెలుపల నేల మీద స్పృహ లేకుండా ఉన్న ఆ మహిళను కాపాడాలంటూ ఆమె కుమారుడు ఎంత వేడుకున్నా ఎవరు పట్టించుకోలేదు. కదలలేని పరిస్థితిలో ఉన్న తన తల్లిపై ఆస్పత్రి వైద్యులు స్పందించకపోవటంతో అతను ఏడుస్తూ ఆస్పత్రి అద్దాలు పగలగొట్టిమరీ సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లే ప్రయాత్నం చేశాడు.

అయినా ఆస్పత్రి సిబ్బంది, వైద్యుల నుంచి ఎటువంటి స్పందన రాలేదు. చివరికి ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై ఆస్పత్రి వైద్యులు స్పందిస్తూ.. ఆ మహిళను ఆస్పత్రి ప్రధాన ద్వారం గుండా తీసుకురాలేదని తెలిపారు. అందువల్లనే ఆస్పత్రి సిబ్బంది స్పందించలేదని, సాయం చేయలేకపోయారని పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన గేటు గుండా కేవలం గర్భిణీ స్త్రీలకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. అనంతరం ఆ మహిళను అంబులెన్స్‌లో జిల్లా అస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. 

మరిన్ని వార్తలు