కాంగ్రెస్‌ నేత హత్య కేసు.. గ్యాంగ్‌స్టర్‌ అరెస్టు

3 Sep, 2019 15:48 IST|Sakshi

చండీగఢ్‌ : హరియాణా కాంగ్రెస్‌ నేత వికాస్‌ చౌదరి హత్య కేసులో ప్రధాన నిందితుడైన సచిన్‌ ఖేరీ(35)ని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈ ఏడాది జూన్‌ 27న వికాస్‌ చౌదరి రౌడీషీటర్ల చేతుల్లో హత్య గురైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో కౌశల్‌, సచిన్‌ ఖేరీ అనే ఇద్దరు గ్యాంగ్‌స్టర్‌లు నిందితులుగా ఉన్నారు. అయితే సచిన్‌ ఫరీదాబాద్‌లో ఉన్నాడనే సమాచారం తెలియడంతో.. అతని పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందం సోమవారం అర్ధరాత్రి రంగంలోకి దిగింది. ఈ క్రమంలో పారిపోయేందుకు యత్నించిన సచిన్‌ పోలీసులపై కాల్పులకు దిగాడు. అయితే దాదాపు అరగంట పాటు శ్రమించిన పోలీసులు సచిన్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

‘‘సచిన్‌ ఫరీదాబాద్‌ పరిధిలో ఉన్నాడని తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్నాం. ద్విచక్ర వాహనం పై ఉన్న సచిన్‌ను లొంగిపోవాలని సూచించినప్పటికీ.. అతడు మా ఆదేశాలు పట్టించుకోకుండా పారిపోడానికి ప్రయత్నించాడు. పైగా పోలీసులపైకి ఎదురు కాల్పులకు జరిపాడు. పోలీసులు ఆత్మరక్షణలో భాగంగా అతనిపై కాల్పులు జరిపారు. దీంతో సచిన్‌ కాలికి గాయమైంది. గాయంతో కిందపడిపోయిన సచిన్‌ను అదుపులోకి తీసుకున్నాం’’ అని సీనియర్‌ పోలీసు అధికారి పేర్కొన్నారు. అనంతరం పోలీసుల కాల్పుల్లో గాయపడిన సచిన్‌ను ఆసుపత్రికి తరలించారు.

కాగా, హర్యానా గ్యాంగ్‌స్టర్‌ కౌశల్‌కు సచిన్‌ సన్నిహితుడని పోలీసులు వెల్లడించారు. సచిన్‌పై ఇప్పటివరకు 200 దోపీడీ, కిడ్నాప్‌, హత్య కేసులు నమోదైనట్లు తెలిపారు. 2012 నుంచి సచిన్‌ పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. కౌశల్‌ గ్యాంగ్‌ అంతా సచిన్‌ నేతృత్వంలోనే నడుస్తుందని పోలీసులు చెప్పారు.

మరిన్ని వార్తలు