సహజీవనం; తలలు ఒకచోట.. శరీరాలు మరోచోట

28 Jan, 2019 18:14 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చండీగఢ్‌ : వివాహిత, ఆమె ఇద్దరు కూతుళ్లను అత్యంత కిరాతకంగా హత్య చేసిన కేసులో ఇద్దరు నిందితులను హర్యానా పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రాజేశ్‌ అనే వ్యక్తి మాత్రం పారిపోయినట్లు తెలిపారు. వివరాలు... అస్సాంకు చెందిన ఓ వివాహిత తన భర్తతో విడిపోయింది. అనంతరం తన పెద్ద కుమార్తె(12)తో కలిసి హర్యానాలోని భివానీ జిల్లాకు చేరుకుంది. ఈ క్రమంలో చెత్తతో వ్యాపారం చేసే రాజేశ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. కొన్ని రోజులపాటు అతడితో సహజీవనం చేసిన సదరు మహిళ మూడేళ్ల క్రితం ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే వీరి వ్యవహారం రాజేశ్‌ కుటుంబ సభ్యులకు తెలియడంతో ఆమెకు దూరంగా ఉండాలంటూ హెచ్చరించడంతో.. అతడు ఆమెను దూరంపెట్టాడు.

ఈ నేపథ్యంలో తనను పెళ్లి చేసుకోవాలని, తన కూతుళ్ల పోషణకు డబ్బు ఇవ్వాలంటూ అతడిని కోరింది. రాజేశ్‌ అందుకు నిరాకరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విసిగెత్తిన రాజేశ్‌ ఆమె అడ్డు తొలగించుకోవాలని భావించాడు. ఇద్దరు స్నేహితులతో కలిసి సదరు మహిళను, ఆమె ఇద్దరు కూతుళ్లను డిసెంబరు 27న హత్య చేశాడు. అనంతరం వారి తలలు నరికి ఓ చోట పాతిపెట్టాడు. శరీరాలను నీళ్ల డ్రమ్‌లో ఉంచి మూత బిగించాడు. అయితే కొన్ని రోజులుగా పిల్లలిద్దరు కనిపించకపోవడంతో పొరిగింటి వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు వారి శవాలను వెలికితీశారు.

మరిన్ని వార్తలు