దారుణం; పార్టీకి రాలేదని నానమ్మను..

22 Apr, 2019 18:00 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చండీగఢ్‌ : హర్యానాలో దారుణం చోటుచేసుకుంది. కొడుకు పుట్టాడన్న ఆనందంలో చేసుకుంటున్న పార్టీకి రాలేదన్న కోపంతో ఓ వ్యక్తి...తన నానమ్మను హతమార్చాడు. శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు... ఫతేబాద్‌ పట్టణానికి చెందిన రామ్‌దేవి(70), రామ్‌ అవతార్‌ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే ఆస్తి పంపకాల విషయంలో విభేదాలు తలెత్తడంతో కొడుకులకు దూరంగా ఉంటున్న వృద్ధ దంపతులు అదే ప్రాంతంలో వేరే కాలనీలో నివసిస్తున్నారు.

ఈ క్రమంలో వారి మనుమడు విక్కీ తనకు కొడుకు పుట్టాడని.. ఇప్పుడైనా తమ ఇంటికి రావాలని ఆహ్వానించాడు. పార్టీకి వచ్చి తమను ఆశీర్వదించాలని కోరాడు. కానీ రామ్‌దేవి మాత్రం అక్కడికి వెళ్లలేకపోయింది. దీంతో కోపోద్రిక్తుడైన విక్కీ..రామ్‌దేవి ఇంటికి వచ్చి ఐరన్‌ రాడ్డుతో ఆమె తల పగులగొట్టాడు. అనంతరం ఆస్పత్రికి తరలిచంగా రామ్‌దేవి మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ క్రమంలో రామ్‌ అవతార్‌ తన మనుమడు, కోడలు, కొడుకుపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో విక్కీ, అతడి తల్లిని అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అతడి తండ్రి పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతడిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తామని వెల్లడించారు.

మరిన్ని వార్తలు