‘నా భార్యకు మళ్లీ పెళ్లి చేయండి’

26 Jan, 2020 12:21 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఆర్థిక ఇబ్బందులతో హెచ్‌డీఎఫ్‌సీ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం 

బంజారాహిల్స్ ‌: ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు జూబ్లీహిల్స్‌ శాఖ డిప్యూటీ మేనేజర్‌ చిత్తలూరి శ్రవణ్‌ కుమార్‌(29) పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని మాదాపూర్‌ మ్యాక్స్‌ క్యూర్‌ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం శ్రవణ్‌ స్పృహలో లేడని తెలిపారు. ఖమ్మం జిల్లాకు చెందిన శ్రవణ్‌కు ఏడాది క్రితం సూర్యాపేటకు చెందిన యువతితో వివాహం జరిగింది. వీరు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం–10లోని గాయత్రిహిల్స్‌లో అద్దెకుంటున్నారు.

ఇటీవలనే భార్య స్వగ్రామానికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో శ్రవణ్‌ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని సూసైడ్‌ లెటర్‌ కూడా రాశాడని పోలీసులు తెలిపారు. తాను తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని అందుకే చనిపోతున్నానని, తన చావుకు ఎవరూ కారణం కాదని రాశాడు. తనకు ఓ వ్యక్తి డబ్బులు బాకీ ఉన్నాడని, ఆ డబ్బులతోనే తన అంత్యక్రియులు నిర్వహించాలని 11 రోజుల దశదినకర్మ చేసి డబ్బులు వృథా చేయవద్దని రాశాడు. తన భార్య చాలామంచిదని ఆమెకు మళ్లీ పెళ్లి చేయాలని కూడా లెటర్‌లో రాయడం జరిగింది. ఈ లెటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు